కవిత ఇలాకాలో కమలం జోరు.. నిజామాబాద్లో బీజేపీ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన...
నిజామాబాద్ లో రసవత్తర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కవిత ఇలాకాలో కమలం దూకుడు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఒకపక్క పసుపు, ఎర్ర జొన్న రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున ఎన్నికల బరిలోకి దిగారు రైతన్నలు. సమస్య తీవ్రత దృష్ట్యా ఎన్నికల సమయంలో కీలక ప్రకటన చేశారు బిజెపి నాయకులు రామ్ మాధవ్.
కవితపై పోటీచేసిన కర్షకుల కన్నెర్ర .. రైతులు అనుకున్నది సాధిస్తారా?
బీజేపీ పసుపు బోర్డు అస్త్రం ... ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతుల అంశం
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు అంశాన్ని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని బిజెపి జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ తెలిపారు. నిజామాబాద్ బిజెపి అభ్యర్థి అరవింద్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాం మాధవ్ ప్రభుత్వ వైఫల్యం వల్లే నిజామాబాద్ లో పెద్ద ఎత్తున రైతులు నామినేషన్లు దాఖలు చేసి బ్యాలెట్ వార్ కు తెరతీశారని ఆయన అన్నారు. రైతుల పక్షాన బిజెపి ప్రభుత్వం నిలబడుతుందని చెప్పిన రామ్ మాధవ్ పసుపు బోర్డు ఏర్పాటుకు బిజెపి సర్కార్ కృతనిశ్చయంతో ఉందని తెలిపారు.
బీజేపీ ప్రకటన కవితకు ఇబ్బందికర పరిణామం
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపు బోర్డును ఏర్పాటు చేసి తీరుతామని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామారావు తెలిపారు. అలాగే పసుపు, ఎర్ర జొన్న, చెరకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం బిజెపి కృషి చేస్తుందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో రైతన్నల ఓటు బ్యాంకు టార్గెట్ గా బిజెపి చేసిన ప్రకటన ఎంపీ కవిత కు ఇబ్బందికర పరిణామం గా మారుతోంది.
రైతులు నామినేషన్లు వెయ్యకుండా సమస్య పరిష్కరించటంలో కవిత విఫలం
మొదటి నుంచి రైతులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రైతులు మాత్రం నామినేషన్లు వేశారు. అంతేకాదు నామినేషన్లు ఉపసంహరించుకోకుండా తీర్మానాలను సైతం చేశారు. ఇక ఇదే అదునుగా బిజెపి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే పసుపు బోర్డు ఏర్పాటుపై తమ నిర్ణయాన్ని ప్రకటన చేసింది.
నిజామాబాద్ లో కమల దండు దూకుడు .. కవిత కు కాస్త కష్టమే
అంతేకాకుండా బిజెపి నుండి ఎన్నికల బరిలోకి దిగిన అరవింద్ ఇప్పటికే చాపకింద నీరులా నిజామాబాద్ లోక్సభ స్థానాన్ని టార్గెట్ గా పెట్టుకుని పని చేస్తున్నారు. ఈ క్రమంలో కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత కు గత ఎన్నికల తరహాలో విజయం అంత సునాయాసం కాదనేది అర్థమవుతోంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోనూ లోక్ సభ ఎన్నికల్లో కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది బిజెపి.