ఆ ఇద్దరు నేతలదీ చెరోదారి: చంద్రబాబుకు తలనొప్పి
నల్లగొండ: నల్లగొండ జిల్లాకు చెందిన ఇరువురు నేతల మధ్య నెలకొన్న విభేదాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారాయి. మాజీ మంత్రులు ఉమా మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు మొదటి నుంచీ చెరోదారిలో నడుస్తున్నప్పటికీ ఇప్పుడు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో పార్టీకి చిక్కు వచ్చి పడింది.
రాష్ట్ర విభజన వరకు చంద్రబాబు వీరిరువురి మధ్య సయోధ్యను కుదర్చడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ, విభజన తర్వాత తెలంగాణలో పార్టీని స్థానిక నాయకులకే వదిలేసినట్లు కనిపిస్తున్నారు. దీంతో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. తెలంగాణలోని తెలుగుదేశం పార్టీలోని నాయకులు ఎవరికి వారే ఓ వర్గంగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తెర మీదికి రావడంతో ఉమా మాధవరెడ్డికి, మోత్కుపల్లి నర్సింహులుకు మధ్య విభేదాలు మళ్లీ తెర మీదికి వచ్చాయి. యాదగిరిగుట్టను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ మోత్కుపల్లి నర్సింహులు కార్యక్రమాలు చేపట్టారు. తన డిమాండ్పై ఆయన ఆలేరు నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేశారు. ఇటీవల డిసెంబర్ 1వ తేదీన ఒక్క రోజు నిరాహార దీక్ష కూడా చేశారు.
అదే సమయంలో భువనగిరిని జిల్లా కేంద్రంగా చేయాలని ఉమా మాధవ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు ఆమె సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాను ఎవరితోనూ పోటీకి రావడం లేదని అంటూనే పుణ్యక్షేత్రం జిల్లా కేంద్రంగా ఉండడం కుదరదని ఉమా మాధవ రెడ్డి అంటూ అందుకు నిదర్శనంగా తిరుపతిని చూపిస్తున్నారు.
తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ మోత్కుపల్లి దీక్షకు మద్దతు పలికారు. ఉమా మాధవ రెడ్డి టిడిపి కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో మీడియా సమావేశం పెట్టి తన వాదనను వినిపించారు. ఇలా ఎవరికి వారు తమ డిమాండ్లను వినిపిస్తున్న తరుణంలో పార్టీపరంగా ఏ నిర్ణయం తీసుకోకపోవడం లోటుగా కనిపిస్తుంది. పార్టీపరంగా నిర్ణయం తీసుకోకుండా రమణ మోత్కుపల్లికి ఎలా మద్దతు ప్రకటిస్తారనే ప్రశ్న కూడా ఎదరవుతోంది.