హిందూపురంలో బాలకృష్ణపై మహిళా టీవీ యాంకర్ పోటీ: కేఏ పాల్, పవన్-కేటీఆర్-జగన్లకు రూ.2 కోట్ల ఆఫర్
హైదరాబాద్/అమరావతి: ప్రజాశాంతి పార్టీ నుంచి వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తన తొలి అభ్యర్థిని ప్రకటించారు. తమ పార్టీకి కులం, మతం, ప్రాంతం ఆధారంగా విభేదాలు లేవని చెప్పారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామన్నారు. అవినీతి రాజకీయ నాయకులను ప్రజలు నమ్మవద్దని కోరారు.
తెలంగాణ సీఎం కేసీఆర్కు జగన్ లేఖ, ఎందుకంటే: 'ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేయదు'
బాలకృష్ణపై శ్వేతారెడ్డి పోటీ అని ప్రకటన
ఈ సందర్భంగా అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణపై పోటీ చేసే అభ్యర్థిని కేఏ పాల్ ప్రకటించారు. హిందుపురం నియోజకవర్గం నుంచి తమ పార్టీ తరఫున ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డి పోటీ చేస్తారని ఆయన తెలిపారు. అలాగే, అమలాపురం నుంచి లక్ష్మీతులసి అనే కాపు సామాజిక వర్గం మహిళకు టిక్కెట్ ఇస్తామన్నారు. యువతను ప్రోత్సహిస్తానని చెప్పారు.
ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్లకు ఎందుకు ఓటేస్తారు
ప్రజాశాంతి పార్టీ కోసం ఏపీలో 50వేల మంది కో ఆర్డినేటర్లను నియమించుకున్నానని కేఏ పాల్ చెప్పారు. ఒక్కో కో ఆర్డినేటర్ కనీసం వెయ్యి మందిని పార్టీలో చేర్పిస్తే ప్రజలు.. ఇక ప్రజలు జగన్ నేతృత్వంలోని వైసీపీకి, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనకు, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి ఎందుకు ఓటు వేస్తారని ప్రశ్నించారు. ఈ ముగ్గురు తనలా సంవత్సరానికి లక్ష కోట్లు తీసుకు రాలేరని, నియోజకవర్గానికి రూ.100 కోట్లు ఇవ్వలేరన్నారు. అది తనకే సాధ్యమన్నారు.
పవన్, జగన్, కేటీఆర్లకు కేఏ పాల్ రూ.2 కోట్ల ఆఫర్
తదుపరి ప్రధానిని సెక్యులర్ ఇండియా కూటమి ఎన్నుకుంటుందని కేఏ పాల్ అన్నారు. దీనికి కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ నాయకత్వం వహిస్తారని చెప్పారు. ఇందులో అఖిలేష్ యాదవ్, మాయావతి, మమతా బెనర్జీ, స్టాలిన్ తదితరులు ఉంటారని చెప్పారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశారని, ఆ సామాజిక వర్గం తాము వెనుకబడి ఉన్నామని అంటోందని, ఆర్ కృష్ణయ్యను అనుసరించే బీసీలు నన్ను నాయకుడు అని చెబుతున్నాయని చెప్పారు. ఆర్జీవీ, పవన్, కేటీఆర్, జగన్లు తనతో వంద, రెండు వందలు, మూడు వందలు, నాలుగు వందల మీటర్ల పరుగుపందెంలో పాల్గొని గెలవాలని సవాల్ చేశారు. తనపై గెలిస్తే రూ.2 కోట్ల బహుమతి ఇస్తానని చెప్పారు.
కేసీఆర్ను కలుస్తా
చంద్రబాబు, జగన్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని కేఏ పాల్ అన్నారు. వారిద్దరూ తన హత్యకు కుట్ర పన్నారన్నారు. ఈ నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ను కలసి కోరిన విషయం తెలిసిందే. పలు యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, కామెడీ క్లిప్పింగులు వేస్తున్నాయన్నారు. వీటికి సంబంధించిన క్లిప్పింగులను కూడా పోలీస్ కమిషనర్కు అందించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం 100 యూట్యూబ్ చానళ్లు, కొన్ని వెబ్సైట్లు, కొంతమంది వ్యక్తులపైన పాల్ ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా కలుస్తానని పాల్ చెప్పారు.