సీరియల్లో చాన్స్ ఇప్పిస్తానని టీవీ ఆర్టిస్టు టోకరా
హైదరాబాద్: టీవీ సీరియల్లో భాగస్వామిగా చేర్చుకుంటానంటూ ఓ టీవీ ఆర్టిస్టు ఓ నిరుద్యోగికి కుచ్చు టోపీ పెట్టాడు. నటుడు కావాలని ప్రయత్నాల్లో ఉన్న హైదరాబాద్ మెహిదీపట్నంకు చెందిన రాయుడు సత్యవర ప్రసాద్కు, టీవీ ఆర్టిస్ట్ బొప్పన విష్ణువర్ధన్ పరిచయమయ్యాడు.
ప్రముఖ ఛానెల్లోని ఓ సీరియల్లో ఛాన్స్ వచ్చిందని, అందుకోసం వెంటనే ఐదు లక్షలు కావాలని, 45 రోజుల్లో తిరిగిచ్చేస్తానని ప్రసాద్కు చెప్పాడు. అంతే కాకుండా 40శాతం వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తానన్నాడు. అయితే, గత జూన్లో డబ్బు తీసుకుని ఇప్పటివరకూ తిప్పుతున్నా పైసా కూడా తిరిగివ్వలేదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పైగా ఐపిఎస్ మాగంటి కాంతారావు తన మామయ్య అని, అతడికి చెబితే ఏదో ఒక పెండింగ్ కేసులో ఇరికిస్తాడని బెదిరిస్తునట్టు తెలిపాడు. ఈ విషయాన్ని ఐపిఎస్ కాంతారావు దృష్టికి తీసుకెళ్లగా, తనకెవ్వరూ తెలిదయని చెప్పారు. దీంతో బాధితుడు తనకు న్యాయం చేయమని కోరుతున్నాడు. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి.