టీవీ ఛానల్ కెమెరామెన్, భార్య ఆత్మహత్య: 2 నెలల క్రితమే పెళ్లైంది
హైదరాబాద్: భాగ్యనగరంలోని వనస్థలిపురంలో ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను రాజీవ్, కవితలుగా మంగళవారం నాడు గుర్తించారు. రాజీవ్ ఓ టీవీ ఛానల్లో కెమెరామెన్గా పని చేస్తున్నారని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్నారు. వీరికి రెండు నెలల క్రితం వివాహం జరిగింది. రాజీవ్, కవితలు నల్గొండ జిల్లా చౌటుప్పల్కు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
కనుమూరి ఇంట్లో కారు, ఆభరణాలు మాయం
మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లోని ఆభరణాలతో పాటు ఇంటి ముందున్న ఇన్నోవా వాహనాన్ని తీసుకొని పరారయ్యారు. బంజారాహిల్స్ రోడ్ నం.12 ఎమ్మెల్యే కాలనీలో కనుమూరి బాపిరాజు నివసిస్తున్నారు.
ఈ నెల 5న అర్ధరాత్రి 2 గంటల తరువాత ఆయన ఇంట్లోకి గుర్తు తెలియని ఆగంతకులు వచ్చారు. వెనుక తలుపు ద్వారా లోపలికి ప్రవేశించారు. అల్మారాలో పెట్టిన దాదాపు రూ.5 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు, అక్కడే ఉన్న ఇన్నోవా తాళం చెవిని తీసుకుని ఇంటి ముందున్న వాహనంతో వెళ్లిపోయారు. బాపిరాజు కోడలు చైతన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.