టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాశ్ అరెస్ట్..!! 12 కోట్లు దుర్వినియోగం: కొనసాగుతున్న విచారణ..!
ప్రముఖ మీడియా సంస్థ టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాశ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నారు. చేశారు. పదిమంది పోలీసులు బృందం రవిప్రకాష్ ఇంటికి వెళ్లి... కారణం చెప్పకుండా అరెస్టు చేసి తీసుకెళ్లిందని ఆయన సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో.. ఏ సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా రవిప్రకాష్ను పోలీసులు అరెస్టు చేశారని వారు వాపోతున్నారు. అయితే.. గతంలో అలందా మీడియా నమోదు చేసిన కేసుల విచారణలో ఉండగా..మరో కొత్త వ్యవహారం తెర మీదకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన సీఈవోగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం పైన నమోదైన కేసులో విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది. దీని పైన పోలీసులు రవి ప్రకాశ్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన్ను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు చెప్పి..తీసుకెళ్లారని ఆయన బంధువులు చెబుతన్నారు. ప్రస్తుతం ఆయనను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంతో రవిప్రకాశ్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో అలందా మీడియా సంస్థలు రవి ప్రకాశ్ మీద అనేక ఫిర్యాదులు చేసింది.
సంస్థ లోగా అపహరణతో పాటుగా నగదు లావాదేవీల వ్యవహారంలోనూ ఆయన మీద అభియోగాలు ఉన్నాయి. గరుడ శివాజీకి సంస్థ వాటాలను అక్రమంగా అమ్మకం పైనా ఫిర్యాదులు విచారణలో ఉన్నాయి. అయితే, తాజాగా మరో కొత్త ఫిర్యాదు నమోదైనట్లు తెలుస్తోంది. ఆయన సంస్థలో సీఈఓగా ఉన్న సమయంల సంస్థ డైరెక్టర్లకు తెలియకుండా సొంతగా దాదాపు 12 కోట్ల రూపాయాలను దుర్వినియోగం చేసారని ఆయన మీద తాజా ఫిర్యాదు. వాటిని తన బినామీ మీడియా సంస్థలను బదిలీ చేసారని అభియోగం దాఖలైంది. డైరెక్టర్లకు తెలియకుండా నిధులు ఎలా మళ్లిస్తారంటూ సంస్థ యాజమాన్యం ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
రవిప్రకాష్పై టీవీ9 ప్రస్తుత యాజమాన్యం అలందా మీడియా పలు ఆరోపణలు విచారణలో ఉన్నాయి. ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, లోగో విక్రయం, సైబర్క్రైమ్ నేరాలకు పాల్పడ్డారంటూ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. ఈ కేసులకు సంబంధించి విచారణకు రవిప్రకాష్ హాజరై.. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గత కొద్దికాలంగా ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదు. తన మీద నమోదైన కేసుల్లో రవి ప్రకాశ్ కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. వీడియా సందేశాల ద్వారా తన భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ఇప్పుడు తాజాగా మరో సారి పోలీసుల రంగ ప్రవేశంతో ఈ ఎపిసోడ్ కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా సంస్థలో అకౌంట్స్ చూసే మూర్తి అనే మరో ఉద్యోగిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆర్దిక లావాదేవీలు జరిగిన ఆధారాలను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. సొంత ఖాతాకు నగదు బదిలీ చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు.