ఆంధ్రాబ్యాంక్ చోరీ కేసులో ట్విస్ట్: యాజమాన్యంపై కేసు
హైదరాబాద్: ఘట్కేసర్లో ఆంధ్రాబ్యాంకులో చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తమ సొమ్మును భద్రపరచడంతో బ్యాంకు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.
దీని ఆధారంగా ఆంధ్రాబ్యాంక్ యాజమాన్యం పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రాబ్యాంక్ ఛైర్మన్, డిజిఎం, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్, ఘట్కేసర్ బ్యాంచ్ మేనేజర్ పైన పోలీసులు కేసు నమోదైంది.
Photos: ఆంధ్రాబ్యాంక్ చోరీ
ఇదిలా ఉండగా, ఆంధ్రాబ్యాంకులో 83మంది ఖాతాదారులకు చెందిన 4.62 కిలోల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారని అధికారులు మంగళవారం నిర్ధారించారు. లాకర్లో భద్రపర్చిన బంగారు నగలు దోచుకెళ్లారు. బ్యాంకులో ఎలాంటి ఆధారాలు లభించకుండా దొంగలు కారంపొడి చల్లడంతో పాటు సీసీ కెమెరాలకు సంబంధించిన కంప్యూటర్ హార్డ్డిస్క్లను తీసుకెళ్లి, కెమెరాలు ధ్వసం చేశారు.
బ్యాంకులో 180 మంది ఖాతాదారులు బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణం తీసుకోగా 83 మందికి చెందిన ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. వారికి తాఖీదులు జారీ చేసి రుణం తీసుకున్న సమయంలో బంగారం మార్కెట్ ధర ఎంత ఉందో అంత చెల్లించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు, దొంగలను పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తమిళనాడుకు చెందిన బాలమురుగన్ ముఠా గతంలో తెలుగురాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులో చోరీకి పాల్పడింది.
ఈ ముఠాలో ప్రధాన నిందితుడు బాలమురుగన్ తప్ప మిగతా ఏ సభ్యుడినీ పోలీసులకు పట్టుకోలేదు. వారి కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నాయి. ముఖ్యంగా బాలమురుగన్ అల్డును సురేష్ కోసం వెతుకుతున్నారు. అతని ఆచూకీ తెలియకపోవడంతో అదే ముఠా చేసి ఉంటుందానే అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.