విల్లా కి'లేడీ'లో కొత్త ట్విస్ట్లు: సీఐ బెదిరిస్తున్నాడని లలిత ఫిర్యాదు
హైదరాబాద్: మహిళా ఫైనాన్సర్ల నుంచి రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్కు వెళ్తే సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరిస్తున్న చిలకలగూడ సబ్ ఇన్స్పెక్టర్, ఎస్సైల పైన చర్యలు తీసుకోవాలని సీతాఫల్మండి ప్రాంతానికి చెందిన శ్రీవాస్తవ భార్య లలిత మంగళవారం నాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడింది. ఫైనాన్షియర్లతో కుమ్మక్కై సెటిల్మెంట్ చేసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె వారి పైన ఆరోపించారు.
విల్లా పేరుతో 2.5 కోట్ల మోసం: టాలీవుడ్ స్టార్స్కూ కి'లేడీ' టోకరా
స్థానికంగా నివాసముండే శోభా జైన్, సోనాలి జైన్, సునీత, పద్మజ, సోనాల్ జైన్, ఆనంద్ జైన్, మీనాక్షి జైన్ ఓ ప్రయివేటు బీమా కంపెనీలో ఉద్యోగులుగా పని చేస్తున్నారని, వీరిలో సోనాలి జైన్, శోభా జైన్, సోనాల్లు గ్రూపుగా ఏర్పడి వడ్డీ వ్యాపారం చేస్తున్నారని తాను కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లానని లలిత చెప్పారు.
వఅయితే తాను కూడా అదే బీమా కంపెనీలో సీనియర్ సేల్స్ మేనేజర్గా పని చేస్తుండటంతో అవసరాల నిమిత్తం వారి నుంచి 2015లో రూ.12 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు చెప్పారు. కేవలం ఆరునెలల వ్యవధిలోనే వారు మూడు రెట్లు అధికంగా డబ్బులు తీసుకొని, ఇంకా రూ.12 లక్షల అప్పు ఉందని, ఇవ్వకపోతే అంతు తేలుస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
సునీత తన భర్త ప్రవీణ్తో కలిసి తాను ఇంట్లోలేని సమయంలో వచ్చి, ఇంట్లో ఉన్న నాలుగు లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలు, రెండు లక్షల రూపాయల లక్షల నగదు, పాస్పోర్టులను తీసుకెళ్లారన్నారు. దీనిపై మార్చి 18న చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
పోలీసులు సొత్తు కాకుండా కేవలం పాస్పోర్టు మాత్రమే రికవరీ చేసి ఇచ్చారన్నారు. చిలకలగూడ సీఐ ఫైనాన్షియర్లతో కుమ్మక్కై చెప్పినట్లుగా వినకపోతే తనపై, తన కుటుంబ సభ్యులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తానని బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలంటూ కమిషన్ను కోరారు.
ఇదిలా ఉండగా, లలిత ఫిర్యాదు పైన చిలకలగూడ ఇన్సుపెక్టర్ కావేటి శ్రీనివాసులు స్పందించారు. లలిత, ఆమె భర్త శ్రీవాత్సవ మూడు నెలల్లోనే పెట్టుబడులు రెట్టింపు వస్తుందని మహిళలకు ఆశలు చూపించి పెద్ద మొత్తంలో వసూలు చేసారని, ఈ కేసును తప్పుదోవ పట్టించి తప్పించుకునేందుకు ఇలా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కాగా, లలిత, ఆమె భర్త శ్రీవాత్సవ విల్లాలో పెట్టుబడుల పేరుతో పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఇది మలుపు తిరిగింది.