లాక్ డౌన్ మందు పార్టీ కేసులో ట్విస్ట్.. అధికారులపై రిపోర్టర్ల అట్రాసిటీ కేసు..
ఖమ్మం జిల్లాలోని మధిర పట్టణంలో ఇటీవల వెలుగుచూసిన అధికారుల మందు పార్టీ ఘటన అనుకోని మలుపులు తిరుగుతోంది. అధికారుల మందు పార్టీని కొంతమంది రిపోర్టర్స్ బయటపెట్టగా.. ఉన్నతాధికారులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో విలేకరుల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ కార్యాలయంలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా.. అధికారుల ప్రైవసీకి భంగం కలిగించారని కేసు పెట్టారు.
షాకింగ్ : లాక్ డౌన్ వేళ అధికారుల మందు పార్టీ.. బాగోతం బయటపడింది..
ఈ నేపథ్యంలో తాజాగా రిపోర్టర్లు ఆ అధికారులపై కౌంటర్ కేసు నమోదు చేశారు. దళితులైన తమను అధికారులు దుర్భాషలాడటమే గాక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మందు పార్టీపై సమాచారం అందడంతో తాము గెస్ట్ హౌజ్ వద్దకు వెళ్లామని.. ఆ సమయంలో తహశీల్దార్ సైదులు డ్రైవర్ త్రివిక్రమ్ తమను అడ్డుకుని దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆపై మిగతా అధికారులు కూడా తమపై దుర్భాషలాడుతూ దాడి చేశారని పేర్కొన్నారు.
Recommended Video
కాగా,అధికారుల మందు పార్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా నియంత్రణలో ప్రజలు చైతన్యవంతంగా వ్యవహరిస్తుంటే.. కోవిడ్-19 విధులు నిర్వహిస్తున్న అధికారులు ఇలా మందు పార్టీ చేసుకోవడమేంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మొత్తం 8 మంది అధికార బృందం గెస్ట్ హౌజ్లో మందు పార్టీ చేసుకోగా.. స్థానిక రిపోర్టర్లు దాన్ని బట్టబయలుచేశారు. గెస్ట్ హౌజ్లోని వంట గదిలో ఖరీదైన మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. అధికారులు వర్సెస్ రిపోర్టర్లకు మధ్య మలుపులు తిరుగుతోన్న ఈ వ్యవహారంలో చివరకు ఏం జరుగుతుందోనన్నది ఆసక్తికరంగా మారింది.