పాల్వంచ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. అన్న అత్యాచారం చేయలేదు.. కానీ..
కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భూమిక అనే యువతిపై ఆమె అన్న రాంబాబు అత్యాచారానికి పాల్పడటంతో.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. భూమిక అన్న రాంబాబు ఆమెపై అత్యాచారానికి పాల్పడలేదని తేలింది. అయితే అతని స్నేహితుడు ఆమెపై అఘాయిత్యానికి యత్నించడంతో.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించవచ్చునని స్థానికులు చెబుతున్నారు.
చెల్లెలితో రాంబాబు గొడవ..
భూమికకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. గురువారం ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యపరీక్షల కోసం వెళ్లిన భూమిక తల్లిదండ్రులు.. ఇంట్లో ఒంటరిగా ఎందుకని.. పాల్వంచలోనే ఉండే అన్న రాంబాబు ఇంటి వద్ద ఆమెను దిగబెట్టి వెళ్లారు. అదే రోజు రాత్రి భూమికను తీసుకుని జ్యోతినగర్లోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు రాంబాబు. అక్కడ ఆమెతో గొడవపడ్డాడు.
బావమరిదితో పెళ్లికి ఒప్పుకోలేదని..
తన బావమరిదితో పెళ్లికి ఒప్పుకోలేదని చెల్లెలితో రాంబాబు గొడవపడ్డాడు. ఆ క్రమంలో ఆమెపై చేయి కూడా చేసుకున్నాడు. అయితే మద్యం మత్తులో ఉన్న రాంబాబు.. కొద్దిసేపటికి అక్కడే పడిపోయాడు. కాసేపటికి రాంబాబు స్నేహితుడు అక్కడికి వచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గుర్తించిన స్థానికులు హుటాహుటిన పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి కొత్తగూడెంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం కన్నుమూసింది.
స్నేహితుడిపై అనుమానాలు..
భూమిక ఆత్మహత్యపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాంబాబు చెల్లెలితో గొడవపడ్డ సమయంలో అతని స్నేహితుడు కూడా ఉన్నాడని అంటున్నారు. రాంబాబు మద్యం మత్తు ఎక్కువై పడిపోయాక.. అతని స్నేహితుడు భూమికపై అత్యాచారానికి యత్నించవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆమె ఆత్మహత్యకు యత్నించిందని అంటున్నారు. తల్లిదండ్రుల విఫర్యాదు మేరకు పోలీసులు రాంబాబు,అతన్ని స్నేహితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.