రేవంత్ ఇంట్లో సోదాల ఎఫెక్ట్: రణధీర్ ఇంట్లో సోదాల్లో ట్విస్ట్, ఆ హార్డ్ డిస్క్లో ఏముంది?
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఓటుకు నోటు కేసులో నిందితుడు ఉదయ్ సిన్హా ఇంట్లో ఐటీ అధికారుల సోదాల నేపథ్యంలో రెండు రోజులుగా రణధీర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఆదివారం నాటి నుంచి ఆయన కనిపించలేదు. ఆయన ఉదయ్ సిన్హా స్నేహితుడు.
ఇప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఐటీ అధికారులమంటూ మా ఇంట్లోకి కొందరు వచ్చారని ఉదయ్ సిన్హా స్నేహితుడు రణధీర్ చెప్పారు. ఇంట్లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ ఉదయ్ సిన్హాదే అన్నారు.
కేసీఆర్ ఆపరేషన్ కొడంగల్: రేవంత్ టార్గెట్గా తెరాసకు 5సార్లు ఎమ్మెల్యే అండ, హ్యాట్రిక్ కొట్టేనా?
మూడు నెలల క్రితం ఇల్లు మారుతున్న సమయంలో ఉదయ్ సిన్హా తనకు ఆ హార్డ్ డిస్క్ ఇచ్చారని తెలిపారు. హార్డ్ డిస్క్లో ఏముందో తనకు అయితే తెలియదన్నారు. మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు.
రణధీర్ రెడ్డి ఇంట్లో సోదాలు
కాగా, ఐటీ అధికారులమంటూ దాదాపు పదిహేను మంది రెండు గంటల పాటు రణధీర్ రెడ్డి నివాసంలో సోదాలు జరిపారు. చివరకు హార్డ్ డిస్క్ దొరకగానే వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ రణధీర్ రెడ్డిని విచారణ కోసమని తీసుకు వెళ్లారు. ఆ తర్వాత సోమవారం అర్ధరాత్రి వదిలి పెట్టారు. రణధీర్ రెడ్డి ఓ ప్రయివేటు సంస్థలో మేనేజర్. నాగోలు ప్రాంతంలో ఉంటున్నారు.
హార్డ్ డిస్క్లో ఏముంది?
ఆదివారం రాత్రి సోదాలు అంటూ 15 మంది వచ్చినప్పుడు రణధీర్ రెడ్డితో పాటు అతని తల్లి, భార్య, మేనకోడలు ఇంట్లో ఉన్నారు. ఇంట్లోని ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అందరినీ గదిలోకి పంపి గడియ పెట్టారు. రణధీర్ రెడ్డిని తమతో పాటు మరో గదిలోకి తీసుకు వెళ్లి విచారించారు. సోదాల అనంతరం హార్డ్ డిస్క్, రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారం, బ్యాంకు లాకర్ తాళం తీసుకున్నారు. వీటిని తీసుకొని రణధీర్ భార్య సంతకం తీసుకున్నారు. ఉదయ్ సిన్హాను తమ వెంట తీసుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఐటీ అధికారులుగా వచ్చిన వారు కేవలం హార్డ్ డిస్క్ కోసమే వచ్చారని తెలుస్తోంది. దీంతో హార్డ్ డిస్క్లో ఏముందనే చర్చ సాగుతోంది. పోలీసులే ఈ సోదాలు జరిపినట్లుగా భావిస్తున్నారు.
24 గంటల తర్వాత విడిచిపెట్టారు
ఆదివారం రాత్రి రణధీర్ రెడ్డిని తీసుకు వెళ్లారు. 24 గంటల తర్వాత సోమవారం రాత్రి విడిచిపెట్టారు. ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద రణధీర్ రెడ్డి అనుమానాస్పదంగా కనిపించారని, సోదా చేయగా హార్డ్ డిస్క్ దొరికిందని పోలీసులు చెబుతున్నారు.
అలా బయటపడింది
ఐటీ శాఖ నుంచి అక్టోబర్ 1న హాజరు కావాలని నోటీసులు రావడంతో ఉదయ్ సిన్హా సోమవారం ఆయకార్ భవన్ వెళ్లారు. రణధీర్రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించారు. ఆ సోదాలతో తమకు సంబంధం లేదని ఐటీ అధికారులు తెలిపారు. దీంతో ఉదయ్ సిన్హా వెంటనే రణధీర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. కుటుంబ సభ్యులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొదట వారు ఫిర్యాదు తీసుకోలేదని, ఆ తర్వాత సోషల్ మీడియాలో, మీడియాలో జోరుగా ప్రచారం కావడంతో ఫిర్యాదు తీసుకున్నారని తెలుస్తోంది.