ట్విస్ట్: మౌనిక, నాగార్జున మధ్య బాండ్ పేపర్ ఒప్పందం
హైదరాబాద్: సికింద్రాబాదులోని నేరేడ్ మెట్ ప్రాంతంలో ఇద్దరు యువతుల ఆత్మహత్య కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. మౌనికతో తనకు ఏ విధమైన సంబంధం లేదని బాండ్ పేపర్ రాయించి నాగార్జునతో సంతకం చేయించినట్లు తెలుస్తోంది. ఇరువురు దూరం కావడానికి బాండ్ పేపర్ ఒప్పందం చేయించడంలో కామేష్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం.
మౌనిక, రాజేశ్వరి సౌమ్య నేరేడ్మెట్ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారమే మౌనిక ఆత్మహత్యకు కారణంగా పోలీసులు తేల్చారు. ఉన్మాది కామేష్ వేధింపులతోనే ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు.
కామేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కామేష్ స్నేహితుడు నాగార్జునను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో నాగార్జున, మౌనిక ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున తల్లిదండ్రులు, స్నేహితుడు కామేష్ కలిసి మౌనిక ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
మౌనికకు, నాగార్జునకు ఎలాంటి సంబంధం లేదని బాండ్ పేపర్ కూడా రాయించుకున్నారు. స్నేహితుడి తరపున రంగంలోకి దిగిన కామేష్ అనంతరం మౌనికను బెదింరిపులకు గురిచేసి లొంగదీసుకున్నాడని అంటున్నారు. తనను ప్రేమించాలని మౌనికను వేధించసాగాడు. అంతేకాకుండా నాగార్జునతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను బయటపెడతానని కామేష్ బెదిరింపులకు పాల్పడ్డాడు.
నేరేడ్మెట్లో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య: కొత్త కోణం, రేప్ చేశారని పేరంట్స్ అనుమానం
ఈ వేధింపులను తట్టులేక మౌనిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే మౌనిక చెల్లెలు వరుస అయ్యే సౌమ్యకు తల్లిదండ్రులు చనిపోవడంతో అక్కతో పాటే జీవిస్తోంది. ఈ క్రమంలో అక్క మౌనిక కామేష్ వల్ల తీవ్ర వేధింపులకు గురి కావడం చివరకు తనవు చాలించాలని నిర్ణయించుకోవడంతో సౌమ్య కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.