వ్యాపారి యాదగిరి హత్యలో ట్విస్ట్: భార్యనే చంపిందా?
హైదరాబాద్: హైదరాబాదులోని సరూర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మూడు నెలల క్రితం జరిగిన ఓ హత్య కేసు మలుపు తిరిగింది. ఈ ఏడాది జులై 21వ తేదీన యాదగిరి అనే వ్యాపారి కర్మన్ఘాట్ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సహజ మరణంగా భావించి మృతదేహాన్ని బంధువులు నల్లగొండ జిల్లాలోని పెదఅడిశర్లపల్లి గ్రామంలో ఖననం చేశారు.
ప్రస్తుతం యాదగిరి బంధువులు ఓ వీడియోను బయటపెట్టి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు కేసును విచారిస్తున్నారు. యాదగిరి మరణానికి ముందు తీసిన ఈ వీడియోలో యాదగిరిది సహజ మరణం కాదని, హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించి ఉంటారనే విషయం వెలుగు చూసింది.
ఆ వీడియోను ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రసారం చేసింది. ఆ టీవీ చానెల్లో యాదగిరి భార్య కవిత గొంతుతో పాటు మరో ఇద్దరి పేర్లు వెలికి వచ్చాయి. వారిద్దరిని యాదగిరి తనను చంపవద్దని వేడుకుంటున్న మాటలు ఆ వీడియోలో రికార్డయ్యాయి.
నువ్వు బతికి ఉండి చేసేదేముందని కవిత హెచ్చరించినట్లుగా భావిస్తున్నారు. రాహుల్ రెడ్డి, జీవా అనే ఇద్దరి పేర్లను యాదగిరి ఉచ్చరించాడు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకని విచారిస్తున్నారు. యాదగిరికి, కవితకు 2013లో వివాహమైంది. వారికి ఓ పాప కూడా ఉంది. యాదగిరి పూర్తిగా తాగుడుకు అలవాటు పడ్డాడు.
మరణం సంభవించిన రోజు యాదిగిరిని ఇరుగుపొరుగువారు, బంధువులు అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. యాదగిరి నాలుక మడత పడి ఉంది. ఒళ్లు నల్లగా తయారైంది. దీని గురించి వైద్యులు ప్రశ్నించగా తాగడం వల్ల అలా అయిందని చెప్పారు.
మరణం తర్వాత ఖననం చేసిన శవాన్ని బంధువుల ఆరోపణలతో వెలికి తీసి దానికి పోలీసులు పోస్టుమార్టం చేయించారు. పక్కటెముకలు, చేయి విరిగిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు.