ఎస్సారెస్పీ కాలువలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
హన్మకొండ గొల్లపల్లి వద్ద ఎస్సారెస్పీ కాలువలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు.
వరంగల్: హన్మకొండ గొల్లపల్లి వద్ద ఎస్సారెస్పీ కాలువలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ కాశీబుగ్గలోని ప్రైవేటు కళాశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులు సోమవారం రెండు వాహనాలపై అంబాలకు వెళ్లారు. వరంగల్ చార్బౌళికి చెందిన షేక్ఖాదర్, హరీష్, గిర్మాజిపేటకు చెందిన మరో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు.
అంబాలలో విందు ముగించుకొని నలుగురు తిరిగి వరంగల్కు వస్తుండగా గొల్లపల్లి వద్ద కృష్ణకాలనీ సమీపంలో ఎస్సారెస్పీ కాలువ వద్ద ఆగారు. ఒక విద్యార్థి షేక్ఖాదర్ బహిర్భూమి కోసమంటూ కాలువ వద్దకు వెళ్లాడు. కాలు జారి అందులో పడిపోయాడు. మరో విద్యార్థి హరీశ్ రక్షించే ప్రయత్నంలో అతను కూడా అందులోకి జారుకున్నాడు. వారిద్దరూ కాలువలో పడిపోయారు.
మిగిలిన ఇద్దరు విద్యార్థులు జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. రాత్రి హన్మకొండ పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారు. వారి పరిధి కాకున్నప్పటికీ వారు వెళ్లి విద్యార్థులు గల్లంతు గురించి కాలువ చుట్టూ ప్రాంతంలో వెతికారు. అయినా ఫలితం కనిపించలేదు.
ఇద్దరు విద్యార్థుల నుంచి పోలీసులు వివరాలను సేకరించారు. వారు చెప్పిన ప్రకారం.. కాలువలో పడిన ఇద్దరు విద్యార్థులకు ఈత రాదు. వారు ఆ నీటి ఉద్ధృతికి మునిగి కొట్టుకుపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాలువ నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర పోలీసులు హైమాస్ లైట్లను తీసుకొని వెతికారు. అయినా గల్లంతైన వారి ఆచూకీ మాత్రం లభించలేదు. మంగళవారం ఉదయం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
అండర్ ట్రయల్ ఖైదీ మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్ర కారాగారంలో అండర్ ట్రయల్ ఖైదీ ఒకరు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. గోదావరిఖనికి చెందిన గంగు కుమారస్వామి (55) అనే వ్యక్తి ఈ నెల 8వ తేదీన జిల్లా కేంద్ర కారాగారానికి వచ్చాడు. గోదావరిఖనికి సంబంధించిన పోలీసులు ఇతనిపై ఐపిసి అండర్ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా కోర్టు అతడికి రిమాండ్ విధించింది. దీంతో అండర్ ట్రయల్ ఖైదీగా కరీంనగర్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.
అయితే ఎప్పటిలాగే ఆదివారం రాత్రి భోజనంచేసిన అతను అర్ధరాత్రి లేచి గుండెలో నొప్పిగా ఉందనగా జైలు సూపరింటెండెంట్ తన సిబ్బందితో కలిసి వైద్యచికిత్స నిమిత్తం అతడిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన అతడిని పరిశీలించిన వైద్యు బిపి పెరగడం, షుగర్ కూడా చాలా ఎక్కువగా ఉందని తెలియజేస్తూ చికిత్స ప్రారంభించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమారస్వామి సోమవారం త్లెవారుజామున మృతి చెందాడు. అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించిన జైలు సిబ్బంది.. పోస్టుమార్టం తరువాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు కరీంనగర్ వన్టౌన్ ఎస్ఐ తులా శ్రీనివాసరావు తెలిపారు.