తప్పిన పెనుప్రమాదం: చక్రాల బోల్టులు బిగించకుండానే బయలుదేరిన ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తుండటంతో ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు బస్సు కండిషన్ను తనిఖీ చేయకుండానే బస్సులను నడుపుతున్నారు వీరు. దీంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.
తాజాగా, సంగారెడ్డి డిపోకు చెందిన రెండు బస్సుల చక్రాల బోల్టులను సరిగా బిగించకుండానే ప్రైవేట్ డ్రైవర్లు బస్సును బయటకు తీశారు. అయితే, డీపో గేటు వద్ద ఉన్న ఆర్టీసీ కార్మికులు విషయాన్ని గమనించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బస్సులను వెనక్కి పంపించి బోల్టులను బిగించారు.
తాత్కాలికంగా ఇప్పుటికిప్పుడు విధుల్లో చేరుతున్న డ్రైవర్లు, కండక్టర్లు బస్సుల కండిషన్పై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. ప్రయాణికుల భద్రత విషయంలో అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు అంటున్నారు.
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని వారంటున్నారు. తాత్కాలిక డ్రైవర్లు కొందరు నిర్లక్ష్యంగా నడుపుతున్నారని అంటున్నారు. ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో తాము తీవ్ర ఆందోళనలకు గురయ్యామని మహిళా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇది ఇలావుండగా, టీఎస్ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సమ్మె విరమింపజేసేలా ఆర్టీసీ సంఘాలను ఆదేశించాలని ఓయూ రీసెర్చ్ స్కాలర్ సురేంద్ర సింగ్ పిటిషన్ దాఖలు చేశారు.
కార్మికుల సమస్యల పరిష్కారానికి స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఆదివారం సాయంత్రం 4గంటలకు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నివాసంలో విచారణ చేపట్టనుంది.
ఇది ఇలా ఉండగా, అక్టోబర్ 5 శనివారం నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సమ్మె విరమించాలని హెచ్చరికలు చేసినప్పటికీ కార్మిక సంఘాలు వెనక్కితగ్గలేదు. సర్కారు బెదిరింపులకు తలొగ్గేది లేదని, తమ డిమాండ్లను నెరవేర్చేవరకూ తాము సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.