తెలంగాణ గడ్డ మీద కరోనా వైరస్ నమోదు కాలే, దుబాయ్లోనే..ఆ రెండు రిపోర్టులు నెగిటివ్: ఈటల
తెలంగాణ గడ్డ మీద ఇప్పటివరకు కరోనా వైరస్ నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. దుబాయ్లో తెలంగాణ వ్యక్తికి వైరస్ సోకిందని, అతను గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వదంతులు నమ్మొద్దని, వ్యాప్తి చేసి ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. వైరస్ సోకిందనే ప్రచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని.. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.
రెండు నెగిటివే..
మైండ్ స్పేస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి, అపోలో శానిటేషన్ మహిళ రిపోర్ట్ పుణె నుంచి వచ్చిందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వారిద్దరికీ నెగిటివ్ వచ్చిందని తెలిపారు. వీరే కాక 21 మందికి కూడా నెగిటివ్ వచ్చిందని.. తెలంగాణ గడ్డ మీద ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని.. ఓ యువకుడికి దుబాయ్లో మాత్రం వచ్చిందని ధృవీకరించారు. అతను గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.
డబుల్ బెడ్ రూం గదుల్లో..
కరోనా వైరస్కు సంబంధించి మందులు, సిబ్బంది, ఐసోలేషన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 93 వేల మందికి వైరస్ సోకగా.. తెలంగాణలో 80 వేల డబుల్ బెడ్ రూమ్లు ఉన్నాయని చెప్పారు. వైరస్ ప్రబలితే.. డబుల్ బెడ్ రూం గదులను ఐసోలేషన్ వార్డులుగా మారుద్దామని సీఎం కేసీఆర్ తెలిపారని చెప్పారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దని.. సందేహాం ఉంటే టోల్ ప్రీ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.
ఆందోళన వద్దు..
కరోనా వైరస్పై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. వైరస్ నివారణకు అన్నీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా వైరస్ సోకిన వారు మాత్రమే హెచ్1 ఎన్1 మాస్కులు ధరించాలని మంత్రి సజెస్ట్ చేశారు. అదరూ మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. లేని విషయాన్ని ఉన్నట్టు కల్పించొద్దని మీడియాకు సూచించారు. గాంధీ ఆస్పత్రికి వెళ్తున్న తాము మాస్క్ ధరించడం లేదని.. తమ సిబ్బంది కూడా అలానే ఉన్నారని చెప్పారు. ఇటీవలే తాను దుబాయ్ వెళ్లొచ్చినట్టు పేర్కొన్నారు.
చర్యలు తప్పవు..
హెచ్ 1 ఎన్ 1 మాస్క్ ధర రూ.25 అని అంతకన్నా ఎక్కువ ధరకు విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. దీనిపై స్పెషల్ టీంమ్తో దాడులు నిర్వహిస్తామని కూడా తెలిపారు.