రెయిన్ ఎమర్జెన్సీ: హుస్సేన్ సాగర్కు పెరుగుతున్న వరద, ఆందోళన (పిక్చర్స్)
హైదరాబాద్: భాగ్యనగరంలో రెయిన్ ఎమర్జెన్సీ కనిపిస్తోంది. భారీగా వర్షాలు కురుస్తుండటం, మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ప్రజల్లో భయాందోళన కనిపిస్తోంది. మరోవైపు భారీ వరదతో హుస్సేన్ సాగర్లోకి చాలా నీరు చేరుతోంది.
ఇప్పటికే హుస్సేన్ సాగర్ దాదాపు నిండింది. నీటిని విడుదల చేస్తున్నారు. ఇలాగే ఉంటే పరిస్థితి ఆందోళనకరంగా మారనుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగర్లోకి ఐదువేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 4600 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది.
అపార్టుమెంట్లలో వరద నీరు చేరడంతో అపార్టుమెంటువాసులు వరద నీటిని మోటార్లతో తోడుతున్నారు. హైదరాబాదుకు మరో ఐదు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది.
గంటలో 20 సె.మీ. వర్షం
హైదరాబాద్ నగరంలోని ఎనిమిది ప్రాంతాల్లో కేవలం 60 నిమిషాల్లోనే అంటే గంటలోనే ఇరవై సెంటీమిటర్ల వర్షం గురువారం నాడు పడింది. గత కొద్ది రోజులుగా హైదరాబాదులో భారీగా వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. మరో నాలుగైదు రోజులు ఈ వర్షాలు ఉండనున్నాయి.
వర్షాలతో అతలాకుతలం
ఎడతెరిపి లేని వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. మరో కొన్ని రోజులపాటు రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సైతం కొనసాగుతోందని వెల్లడించారు.
రెయిన్ ఎమర్జెన్సీ: హుస్సేన్ సాగర్కు పెరుగుతున్న వరద, ఆందోళన (పిక్చర్స్)
ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పారు. కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిజాం సాగర్లో నీళ్లు
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తొలిసారిగా వరద నీరు వచ్చి చేరుతున్నది. గడిచిన మూడేళ్లుగా కళావిహీనంగా తయారై, ఎడారిలా మారిన ప్రపంచంలోని తొలి భారీ ప్రాజెక్టు నిజాంసాగర్లోకి గడిచిన 24 గంటల్లో వెయ్యి క్యూసెక్కులకు పైగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ఎంతోకాలంగా ప్రాజెక్టు నీటికోసం ఎదురుచూస్తున్న రైతులు, స్థానికుల్లో చిన్న ఆశ మొదలయ్యింది.
మంజీరా నది..
మంజీరా నది ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కట్టిన చిన్నచిన్న ప్రాజెక్టుల ప్రభావం నిజాంసాగర్ పైన పడింది. దీనికితోడు గడిచిన రెండు సంవత్సరాల వర్షాభావ పరిస్థితి కారణంగా ప్రాజెక్టులోకి నీటిచుక్క రాకపోవడంతో ప్రాజెక్టులో నీటిని నిల్వచేసే ప్రాంతం నెర్రెలిచ్చి ఎడారిగా మారింది. గోదావరి ఉపనది అయిన మంజీరాపై 375వ మైలురాయి వద్ద నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువభాగంలో గడిచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీటి ప్రవాహం మొదలయ్యింది.
నిజాం సాగర్
గురువారం ఉదయం ఆరు గంటల వరకు ప్రాజెక్టులోకి 1007 క్యూసెక్కుల నీరు చేరినట్టు నమోదైంది. నిజాం సాగర్లో 0.09 టీఎంసీల నీరు వచ్చి చేరినట్టు నీటిపారుదల శాఖ ప్రతిరోజూ వెల్లడించే నివేదికలోనూ నిర్ధారించారు. మంజీరా నదిపై 1930-31 ప్రాంతంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో 426 మైళ్ల పొడవున ప్రవహించే ఈ నది 264వ మైలువద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.
హైదరాబాద్ ట్రాఫఇక్ పరిస్థితిపై సమీక్ష
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ పరిస్థితిని డిజిపి అనురాగ్ శర్మ సమీక్షించారు. గురువారం ఆయన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు మహేందర్ రెడ్డి, సందీప్ శాండిల్య, మహేష్ భగవత్లతో తన కార్యాలయంలో సమావేశమై నగరంలో పరిస్థితి గురించి చర్చించారు. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకూ ట్రాఫిక్ సిబ్బంది వాహనదారుల వద్ద చలానాలు వసూలు చేయవద్దని డీజీపీ ఆదేశించారు.
డిజిపి సమీక్ష
ట్రాఫిక్తోపాటు సివిల్ పోలీసులు కూడా వాహనాల నియంత్రణ విధులు నిర్వహించాలని, తమ పరిధిలో వర్షం నీరు ఆగే ప్రాంతాలను గుర్తించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట ట్రాఫిక్ మళ్ళించాలని, ఈ విషయం ఎప్పటికప్పుడు వాహనదారులకు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని డిజిపి సూచించారు. వర్షాలు తగ్గేవరకు పోలీసులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
రైళ్ల నిలిపివేత
భారీ వర్షాలతో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని నడికుడి- గుంటూరు మధ్యలో రైల్వే పట్టాలపై వరద నీరు ప్రవహిస్తున్న కారణంగా పలు రైళ్లను రద్దుచేసినట్లు జీఎం రవీంద్ర గుప్తా తెలిపారు. బెల్లంకొండ వద్ద వంతెన పైనుంచి వరదనీరు పోతుండడంతో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ను వెనక్కి తీసుకొచ్చామన్నారు. పల్నాడు ఎక్స్ప్రెస్ను రెడ్డిగూడెం వద్ద నిలిపివేశామన్నారు.
సమీక్షిస్తున్నాం
వరద ప్రాంతాల్లో చిక్కుకున్న అపార్ట్మెంట్ల వద్ద ట్రాన్స్కో, డిస్కం, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది గంటగంటకు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ట్రాన్స్కో, డిస్కం సీఎండీలు ప్రభాకర్రావు, రఘుమా రెడ్డి తెలిపారు. గురువారం వారు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కేపీహెచ్బీ మూడో ఫేజ్లోని డివిజన్ కార్యాలయంలో మాట్లాడారు. అపార్ట్మెంట్ల సెల్లార్లలో వరద తొలగింపు ప్రక్రియ పూర్తి కాగానే సరఫరా పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
సహాయక చర్యలు
సహాయ చర్యలను వేగిరం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైం ది. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న పనులను గ్రేటర్ కమిషనర్ బి.జనార్దనరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. వర్షం తగ్గితే మోటార్లను పెట్టి నీటిని తోడించేందుకు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ దగ్గర 40 అతి పెద్ద మోటార్లు ఉన్నాయి. అగ్నిమాపక శాఖ యంత్రాలనూ ఇందుకు వినియోగి స్తున్నారు. వరద బాధితులను ఆదుకొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటున్నామని కమిషనర్ ‘ఈనాడు'కు తెలిపారు. భారీ వర్షాలతో ముంపు సమస్యే అధికంగా ఉందని.. వర్షాలు తగ్గిన వెంటనే నీటిని తొలగిం చడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామ న్నారు. శిథిల భవనాల్లో ఉన్న వారు ఖాళీ చేయాలని ఆయన కోరారు.
ప్రజల బాధలు వర్ణనాతీతం
వరద ప్రభావిత ప్రాంతాల్లోని పలు కాలనీల్లో ప్రజలు రెండోరోజు గురువారం కూడా అంధకారంలో మగ్గారు. 48 గంటలు అవుతున్నా చాలా నివాసాల్లో విద్యుత్తు లేక నరకయాతన పడుతున్నారు. నివాసాల సెల్లార్లలో వరద నీరు ఉండటంతో కరెంట్ ఇవ్వలేమని విద్యుత్తు అధికారులు తేల్చి చెప్పారు. ప్రమాదాలు జరగకుండా సరఫరా నిలిపివేశామని, నీరు తోడితే తప్ప తామేం చేయలేమంటున్నారు. దీంతో వరదలో చిక్కుకున్న నివాసాల్లో అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
అపార్టుమెంట్లలో నీరు తోడేస్తున్నారు
నిజాంపేట, బండారి లేఅవుట్, హైదర్నగర్, మియాపూర్, బాచుపల్లి, కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాల్లోని పదుల సంఖ్యలోని కాలనీలో ఉన్న 200 వరకు బహుళ అంతస్తుల నివాసాల సెల్లార్లలోకి వరద చేరడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి సరఫరా నిలిపేశారు. గురువారం నాటికి 138 అపార్టుమెంట్లలో సరఫరా పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.
జనం విలవిల
వారం రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తుండటంతో జనం విలవిలలాడుతున్నారు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుండటంతో వాగులు, పొంగుతుండగా, చెరువులు, కుంటలు మత్తడిపోస్తున్నాయి. భారీ వర్షాలకు చెరువులకు గండ్లుపడటంతో నీరంతా వృథాగా పోతున్నది. పట్టణ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో మూడురోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికల మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.
దంచికొట్టిన వాన
కుండపోత వర్షం, లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. బుధవారం రికార్డుస్థాయిలో వర్షం కురిసింది. దాని నుంచి కోలుకోకముందే గురువారం కూడా వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం మూడు సెంటీమీటర్ల జోరువాన కురిసింది. అత్యధికంగా ఉప్పల్లో 3.47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు, పురాతన భవనాల్లో ఉంటున్న ప్రజలు కట్టుబట్టలతో సహాయ శిబిరాలకు తరలివెళ్లారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోయింది.
పులిచింతల వద్ద విద్యుదుత్పత్తి ప్రారంభం
పులిచింతల జలవిద్యుత్ కేంద్రంలో మొదటి యూనిట్ పనులకు ఇటీవలే మెకానికల్ ట్రయల్ వేసిన అధికారులు గురువారం ట్రయల్న్ నిర్వహించారు. 120 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంతో నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రంలోని నాలుగు యూనిట్లలో మొదటి యూనిట్ పనులు ఇటీవల పూర్తయ్యాయి. దీంతో సీతాపురం సబ్ స్టేషన్ నుంచి పులిచింతల వద్ద ఉన్న బస్కు రివర్స్ చార్జి చేసిన అధికారులు యూనిట్లో సాంకేతిక లోపాలను సరిచేసుకున్నారు. శుక్రవారం ఉదయం విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్ఈ సద్గుణరావు తెలిపారు.
ఎన్టీఆర్ మార్గ్
ఎన్టీఆర్ మార్గ్లో రెండు రోజుల క్రితం భూమి కుంగిపోయిన విషయం తెలిసిందే. ఈ గోయికి మరమ్మతులు కూడా చేశారు. బుధవారం నాడు భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని ఎన్టీఆర్ మార్గ్లో రోడ్డు హఠాత్తుగా కుంగిపోయింది. ఆ సమయంలో ఎక్కువ మంది ప్రయాణం చేయకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఎన్టీఆర్ మార్గంలో గొయ్యి
ఆరు మీటర్ల రోడ్డు కుంగిపోయింది. ఇది నాళాకు చెందిన మార్గం. ఇప్పుడు కుంగిన నాళా మార్గం రెండు కిలోమీటర్ల మేర ఉంది. దీంతో మూడు రోజులు ట్రాఫిక్ మళ్లించారు. కుంగిన ప్రాంతాన్ని జిహెచ్ఎంసి అధికారులు పూడ్చివేశారు.
ఎన్టీఆర్ మార్గంలో గొయ్యి పడిన దృశ్యం
అలాగే, నాళా ఉన్న రెండు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని చూసేందుకు ట్రాఫిక్ను మూడు రోజుల పాటు మళ్లించారు. తెలంగాణ సచివాలయం, ఐమాక్స్ మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.