హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో నిందితులకు ఈ రోజు శిక్ష ఖరారు చేయనున్న కోర్టు
హైదరాబాద్: 2007 జంటపేలుళ్ల కేసులో నిందితులకు ఈ రోజు మెట్రోపాలిటన్ కోర్టు శిక్షను ప్రకటించనుంది. 2007 ఆగష్టు25 న ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు రెండు బాంబులను పేల్చారు. ఈ ఘటనలో 44 మంది మరణించగా 68 మంది మృతి చెందారు. ఈ రెండు బాంబులు ఒకటి లూంబినీ పార్కులో అమర్చగా రెండోది ఓల్డ్ సిటీలోని గోకుల్ చాట్లో అమర్చారు. దాదాపు 11 ఏళ్లపాటు సాగిన విచారణ అనంతరం సెప్టెంబర్ 2న రెండో అడిషనల్ మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి టి. శ్రీనివాస్ రావు అనీక్ షఫీక్ సయీద్, మొహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలను నిందితులుగా పేర్కొంటూ తీర్పు చెప్పారు. అయితే మరో ఇద్దరు ఫరూక్ షర్ఫుద్దీన్ తర్కాష్, మొహ్మద్ సదిక్ ఇస్రార్ అహ్మద్ షేక్లపై సరైన ఆధారాలు లభించకపోవడంతో వారిని నిర్దోషులుగా కోర్టు పేర్కొంది.
ఇద్దరిని దోషులుగా తేల్చిన కోర్టు, మరో ఇద్దరిపై ఆధారాల్లేవు
మరోవైపు కేసులో నిందితుడిగా ఉన్న ఐదో వ్యక్తి తారిక్ అంజుమ్కు కూడా జడ్జి శిక్ష విధించనున్నారు. ఈ వ్యక్తి ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా నేరస్తులకు ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలు రుజువయ్యాయి. నిందితులంతా ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. వీరికి చర్లపల్లి జైలులోనే శిక్షను ప్రకటిస్తారు న్యాయమూర్తి. 44 మంది ప్రాణాలను తీసిన నిందితులకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ న్యాయమూర్తిని కోరనుంది. మరోవైపు డిఫెన్స్ మాత్రం హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.
అనీక్, చౌదరి అనే ఇద్దరు నిందితులు గోకుల్ చాట్ లుంబినీ పార్కులో బాంబులు పెట్టారని... దిల్షుక్నగర్లోని ఫుట్ఓవర్ బ్రిడ్జి కింద కూడా మరో బాంబు అమర్చారు కానీ అది పేలలేదని మరో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే సురేందర్ తెలిపారు. గోకుల్ చాట్లో ఆగష్టు 25,2007లో పేలిన బాంబు 32 మందిని పొట్టనబెట్టుకుంది. 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. లుంబినీ పార్కులో పేలిన బాంబు ఘటనలో 12 మంది మృతి చెందగా 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురు నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారు. వారిలో ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకులు రియాజ్ భక్తల్, అతని సోదరుడు ఇక్బాల్, మరో నిందితుడు ఆమిర్ రేజా ఖాన్లు పరారీలో ఉన్నారు. భక్తల్ సోదరులు పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం.