హైద్రాబాద్ జంటపేలుళ్లు: ఇద్దరిని దోషులుగా తేల్చిన కోర్టు, మరో ఇద్దరిపై ఆధారాల్లేవని...
Recommended Video
హైదరాబాద్: 2007 ఆగస్ట్ 25న హైదరాబాదులో జరిగిన జంటపేలుళ్ల కేసులో నాంపల్లి అదనపు మెట్రో పాలిటన్ జడ్జి మంగళవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరిని దోషులుగా తేల్చింది. మరో ఇద్దరి నిందితులపై ఉన్న కేసును కొట్టి వేసింది. వారిపై ఆధారాలు లేవని తేల్చింది. వచ్చే సోమవారం వారికి శిక్షను ఖరారు చేయనుంది. ఏ1, ఏ2లు అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీక్ షఫీద్ సయ్యద్లను దోషులుగా తేల్చారు. చర్లపల్లి జైలులోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నుంచి తీర్పు వెల్లడించారు.
2007 ఆగస్ట్ 25వ తేదీన హైదరాబాదులో జరిగిన జంటపేలుల్ల కేసులో న్యాయస్థానం మంగళవారం తీర్పు వెల్లడించింది. 11 ఏళ్ల క్రితం లుంబినీ పార్క్, కోఠిలోని గోకుల్ ఛాట్లో నిమిషాల వ్యవధిలో ఉగ్రవాదులు బాంబులు పేల్చిన విషయం తెలిసిందే.
ఈ దుర్ఘటనలో నలభై మందికి పైగా మృతి చెందారు. చాలామంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులుఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తు జరిపిన సిట్ బృందం తేల్చింది.
అనీక్, ఇస్మాయిల్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, మహ్మద్ తారీఖ్, షప్రుద్దీన్, మహ్మద్ షేక్, అమీర్ రజాఖాన్లను నిందితులుగా ఛార్జీషీటులో పేర్కొంది. వీరిలో అరెస్టైన ఐదుగురు ప్రస్తుతం చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉన్నారు.