వర్షాలు: 'టెక్కీలని ఇంటి నుంచి పని చేసుకోవ్వండి', డేంజర్ బెల్స్!
హైదరాబాద్: భాగ్యనగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో నగరం చెరువులను తలపిస్తోంది. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
ఏ సమయంలోనైనా వర్షం కాస్త తెరిపినిస్తే నిత్యావసర వస్తువుల కొనుక్కోవడానికి, విధులకు హాజరయ్యేందుకే ఇళ్ల నుంచి నగరవాసులు బయటకు వస్తున్నారు. హైదరాబాద్ చరిత్ర కనీవినీ ఎరుగని విధంగా ట్రాఫిక్ ఎమర్జెన్సీ విధించాల్సి వస్తోంది.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నేడు, రేపు జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అలాగే కీలకమైన ఐటీ పరిశ్రమ ఉద్యోగులకు ఈ రెండు రోజులు ఇంటి నుంచి విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలని జిహెచ్ఎంసి అధికారులు ఐటీ కంపెనీలకు సూచించారు.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఇంటి నుంచి పని చేయడమే ఉద్యోగులకు మంచిదని చెబుతున్నారు. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా సముచిత నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా, వీకెండ్ కావడంతో వివిధ ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించే అవకాశముంది.
డేంజర్ బెల్స్!
దానికి తోడు మరో రెండు రోజుల పాటు హైదరాబాదులో అతిభారీ వర్షాలు పడవచ్చునని వాతావరణ శాఖ చెప్పడంతో అందరి వెన్నులో వణుకు పుడుతోంది. హుస్సేన్ సాగర్ ఇప్పటికే నిండింది.
ఇలాంటి పరిస్థితుల్లో సాగర్ కట్టలు తెగితే పరిస్థితి ఏమిటనే ఆందోళన కనిపిస్తోంది. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.