క్రికెట్ ఆడుతూ నీళ్లలో మునిగి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. క్రికెట్ బంతి కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి విద్యార్థులు మరణించారు. ఈ సంఘటన జిల్లాలోని నిర్మల్ మండలం మంజులాపూర్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
మంజులాపూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ నవ్మాన్ (14), స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అబుల్ (15) అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం వారిద్దరు స్నేహితులతో కలిసి గ్రామ శివారులో ఉన్న చెరువు వద్దకు క్రికెట్ ఆడడానికి వెళ్లారు.
క్రికెట్ ఆడుతున్న సమయంలో బంతి వెళ్లి చెరువులో పడింది. దాని కోసం వన్మాన్ చెరువులోకి దిగాడు. చెరువు లోతు ఎక్కువగా ఉండడంతో అతను నీటిలో మునిగిపోయాుడ. అది గమనించిన అబుల్ అతన్ని రక్షించడానికి చెరువులోకి దిగాడు. ఇతనికి కూడా ఈత రాకపోవడంతో ఇద్దరు నీట మునిగిపోయారు.
ఇది గుర్తించిన స్థానికులు వారి మృతదేహాలను వెలికి తీశారు. ఆ సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.