ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్ళిన కారు: ఇద్దరు మహిళల మృతి
కరీంనగర్: ఎస్సారెస్పీ కాలువలోకి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సోమవారం చోటుచేసుకుంది. చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎఎన్ఎమ్లుగా పనిచేస్తున్న అనంతకుమారి(42), బాలసరస్వతి(35)లు సోమవారం ఫైలేరియా సర్వేతో పాటు ఫైలేరియా నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అనంతకుమారి సొంత కారులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వారికి ఇచ్చిన సెక్టార్ గ్రామాలైన రుక్మాపూర్, కోనేరుపల్లి, కాట్నపల్లి, మల్లన్నపల్లి, సాంబయ్యపల్లిలకు వెళ్లారు.
కాట్నపల్లిలో విధులు నిర్వహించి కోనేరుపల్లికి కాకతీయ కెనాల్ బ్రిడ్జి వద్ద ప్రధాన కాలువమీదుగా వెళుతుండగా ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తున్న కారు కాలువలోకి దూసుకెళ్ళడంతో ఇద్దరు మృతి చెందారు. కాగా, డ్రైవర్ హరీష్ వెనుక సీటులో కూర్చొని ఉన్నాడని, అదుపుతప్పే సమయంలో వెనుకాల ఉన్న అద్దాలను పగులగొట్టి బయటికి దూకాడని పెద్దపల్లి డిఎస్పీ నల్ల మల్లారెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్లు తెలిపారు.
కోనేరుపల్లి వద్ద కాలువలో కారు పడగా కారులోనే చిక్కుకుపోయిన ఆనంతకుమారి మృత దేహాన్ని క్రేన్ సహాయంతో బయటకి తీశారు. కాగా, బాలసరస్వతి కాలువలో కొట్టుకెళ్లి కరీంనగర్ మండలం కొత్తపల్లి వద్ద మృత దేహం ఆగడంతో పోలీసులు మృత దేహాన్ని బయటికి తీశారు. అనంతకుమారి, బాలసరస్వతి ఇద్దరు కూడా కరీంనగర్ నగర వాస్తవ్యులు. అనంతకుమారి గత మూడు సంవత్సరాలుగా చొప్పదండి పిహెచ్సిలో పనిచేస్తుండగా, బాలసరస్వతి ఈ మధ్యనే ఆరు నెలల క్రితం చొప్పదండికి వచ్చి విధులు నిర్వహిస్తోంది.
రుక్మాపూర్ క్లస్టర్కు అనంతకుమారి ఒకటవ ఎఎన్ఎమ్గా, రెండవ ఎఎన్ఎమ్గా బాలసర్వతి పనిచేస్తున్నారు. అంనతకుమారికి భర్త సంపత్ కుమార్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్త ఆర్టీసీ మెకానికల్ ఇంజనీర్ సూపర్వైజర్గా పని చేస్తుండగా, ఇద్దరు కుమార్తెలకు పెళ్లి అయింది. మూడవ కూతురు ఎంబిబిఎస్ చదువుతోంది.
బాల సరస్వతికి భర్త రాంచందర్, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త ఎలిగేడు ఎస్బిఐలో రికార్డ్ అసిస్టెంట్గా పని చేస్తుండగా కూతుర్లు, కుమారుడు చదువుకుంటున్నారు. ఇద్దరి మృతితో వారి కుటుంబాల్లో విషాదచాయలు నెలకొన్నాయి.