ఈడీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీపై కఠిన చర్యలు: జగన్, సుజనా చౌదరి హైప్రొఫైల్
హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారి, వస్తు, సేవ పన్ను (జీఎస్టీ) ప్రస్తుత సూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాస గాంధీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) కఠిన చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేసింది. అయిదు కోట్ల రూపాయల లంచం కేసు ఆరోపణలను ఆయన ఎదుర్కొంటోన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ పరిణామాల మధ్య బొల్లినేని శ్రీనివాస గాంధీని సస్పెండ్ చేస్తూ సీబీఐసీ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ కేసులో ఆయనతో పాటు చిలక సుధారాణి సస్పండ్ అయ్యారు.
ఇదివరకు ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి వంటి హైప్రొఫైల్ కేసులను విచారించిన విషయం తెలిసిందే. జీఎస్టీ సూపరింటెండెంట్గా నియమితులయ్యాక అయిదు కోట్ల రూపాయల లంచం కేసులో ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టబడ్డారు. ఆయన ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులను కూడబెట్టినట్టు గుర్తించింది. ఆదాయానికి మించి ఆస్తులను ఆర్జించిన విషయంలో సీబీఐ విచారణను ఎదుర్కొంటోన్నారు.
తాజాగా ఆయనపై సీబీఐసీ చర్యలు తీసుకుంది. బొల్లినేని శ్రీనివాస గాంధీతో పాటు సుధారాణిని సస్పెండ్ చేసింది. తన సామాజిక వర్గానికి చెందిన సుజనాచౌదరి కేసును బొల్లినేని నీరుగార్చారని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సీబీఐ ఆయనపై నిఘా వేసింది. అనంతరం దాడులను చేపట్టింది. హైదరాబాద్, విజయవాడ వంటి చోట్ల ఆయనకు చెందిన నివాసాలు, కార్యాలయంపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన అనంతరం భారీ ఎత్తు అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించింది. ఆయనపై ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది.
ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దాని గ్రూప్ సంస్థలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వ్యవహారంలో శ్రీనివాస గాంధీ అయిదు కోట్ల రూపాయల లంచాన్ని డిమాండ్ చేశారంటూ ఇదివరకు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయనతో పాటు సుధారాణి సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. భరణి కమోడిటీస్ అండ్ హైదరాబాద్ స్టీల్స్ డైరెక్టర్ సత్య శ్రీధర్ రెడ్డి జగన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిద్దరిపై సీబీఐ కేసు నమోదు చేసింది.