ముత్తూట్ ఫైనాన్స్ కేసు: అరటి పండ్ల వ్యాపారి కీలక పాత్ర, నిందితుల్లో టెక్కీ
మైలార్దేవ్పల్లి ముతూట్ ఫైనాన్స్ దోపిడీ యత్నం కేసులో నలుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగుర్ని అరెస్టు చేశామని ముగ్గురు పరారీలో ఉన్నారని సైబరాబాద్ జాయింట్ సిపి షానవాజ్ ఖాసిం తెలిపారు.
హైదరాబాద్: ఈ నెల 4వ తేదీన జరిగిన మైలార్దేవ్పల్లి ముతూట్ ఫైనాన్స్ దోపిడీ యత్నం కేసులో నలుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముతూట్ ఫైనాన్స్ దోపిడి చేయడానికి ఏడుగురు ప్రయత్నించగా వారిలో నలుగుర్ని అరెస్టు చేశామని ముగ్గురు పరారీలో ఉన్నారని సైబరాబాద్ జాయింట్ సిపి షానవాజ్ ఖాసిం తెలిపారు. దోపిడీకి యత్నించిన ముఠాలో ఐదుగురు మహారాష్టక్రు చేందిన వారు కాగా ఇద్దరు హైదరాబాద్కి చేందిన వారని ఆయన తెలిపారు.
ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ యత్నం కేసులో అరటి పండ్ల వ్యాపారి కీలక పాత్ర పోషించినట్లు తేలింది. హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట, బండ్లగూడకు చెందిన మహ్మద్ దస్తగిరి రోడ్డు మీద అరటి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
అతడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తెను ఉస్మానాబాద్కు చెందిన అర్షద్ పులుముద్దీన్ ఖాన్కు ఇచ్చి వివాహం చేశాడు. మైలార్దేవ్పల్లి ముత్తూట్ కేసులో ప్రధాన నిందితుల్లో అతను కూడా ఉన్నాడు. దస్తగిరి నగరంలో జరిగిన ముత్తూట్ దోపిడీ వార్తలను పేపర్లలో చదివాడని, అతడి అల్లుడు ఫోన్ చేయగానే ముత్తూట్ గురించే చెప్పాడని, దోపిడీ చేయడానికి వెళ్లినప్పుడు దస్తగిరి బయటి పరిస్థితులు పరిశీలించాడని ఒక పోలీస్ అధికారి చెప్పారు.
హ్యాపీ హోమ్స్లో ఇలా.....
ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీకి ప్రయత్నించినవారు కారును హ్యాపీ హోమ్స్లోని ఓ అపార్ట్మెంట్ కింద పార్క్ చేసి పారిపోయారు. వాచ్మన్ సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అందులో ఉన్నారనే అనుమానంతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలను రంగంలోకి దింపారు. ఈ విషయాన్ని టీవీలో చూసి దస్తగిరి తెలుసుకున్నాడు. వెంటనే హ్యాపీహోమ్స్ వద్దకు వెళ్లి ఏం జరుగుతుందో ఆరా తీశాడు. తన అల్లుడు అర్షద్, షరీఫ్లకు ఫోన్ చేసి సమాచారం అందించాడని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. ఆ రోజు అర్ధరాత్రి అక్కడే ఉండి తర్వాత బండ్లగూడలోని ఇంటికి వెళ్లాడు.
Recommended Video
భయపడి కుటుంబంతో సహా..
హ్యాపీ హోమ్స్లో పోలీసులను చూసిన దస్తగిరి భయపడ్డాడు. అరెస్టు చేస్తారని భయపడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకు వెళ్లాడు. నాలుగు రోజులు అక్కడే ఉన్నాడు. కుటుంబంతో కలిసి అజ్మీర్ నుంచి నేరుగా ఉస్మానాబాద్కు వెళ్లి ముఠాను కలిశాడు. ముఠా సభ్యులకు దస్తగిరి ఫోన్లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేశాడని, టీవీ చానెళ్లలోనూ పత్రికల్లోనూ వస్తున్న వార్తాకథనాలను వివరించాడని దోపిడీ విఫలయత్నానికి ముందు తన అల్లుడు అర్షద్, షఫీయుద్దీన్, ఫారుఖ్కు అతడి ఇంట్లోనే ఉన్నారని పోలీస్ అధికారి అన్నారు.
టెక్కీ కూడా ఉన్నాడు...
ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ యత్నం కేసులో నిందితుడు షఫీయుద్దీన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతడు ప్రస్తుతం సీసీటీవీ కెమెరాల తయారీ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. దోపిడీ జరిగిన తర్వాత డీవీఆర్ను దొంగిలిస్తే సులువుగా తప్పించుకోవచ్చని షఫీయుద్దీన్ ముఠా సభ్యులకు చెప్పాడు.
పరారీలో ప్రధాన నిందితుడు
ప్రధాన నిందితుడు షరీప్ పరారీలో ఉన్నాడని షానవాజ్ చెప్పారు. ముంబాయికి చేందిన అర్షద్ ఫూలీముద్దీన్ ఖాన్(28) షార్ఫూద్దీన్ నవాబుద్దీన్ సయ్యద్(30) సంతోష్ దశరత్ వీర్కర్(35) మహ్మద్ దస్తాగిరి(55) లను అరెస్టు చేసినట్లు షా నవాజ్ తెలిపారు. కేసు దర్యాప్తులో నిందితులు వాడిన తవేరా వాహనంతో పాటు అందులో దొరికిన ప్లాస్టిక్ కవరే కీలక ఆధారంగా మారాయని వివరించారు. తవేరా వాహనాన్ని గుజరాత్ దొంగిలించి దానితోనే దోపిడీలు చేస్తున్నారని చెప్పారు.
ఇలా పరిచయం...
నిందితులందరికీ మహారాష్టల్రోని ధుల్యా సబ్ జైల్లో పరిచయం ఏర్పడిందని షానవాజ్ తెలిపారు. ప్రధాన నిందితుడు షరీఫ్, అర్షద్ ఖాన్లు 2014లో ఫైనాన్స్లు దోపిడీ చేసిన కేసులో నిందితులని మూడో నిందితుడు నకిలీ నోట్ల చేలామణిలో జైలుకు వెళ్లారని ఆయన తెలిపారు. దస్తగిరి, మరో నిందితుడు అన్న (పరారీలో ఉన్న వ్యక్తి) వీరిద్దరు మహారాష్ట్ర ముఠాతో చేతులు కలిపి దోపిడీకి ప్రయత్నించారని చెప్పారు. కేసు దర్యాప్తుకి సిసిపూటేజ్, ఫింగర్ ప్రింట్ల ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుండి తవేరా కారు, రెండు కత్తులు, ఇనుప రాడ్, నాలుగు మొబైల్ ఫోన్లతో పాటు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.