దివాకర్ ట్రావెల్స్ బస్సు మరో ఘోరం: ఈసారి తెలంగాణలో...
దివాకర్ ట్రావెల్స్ బస్సు మరోసారి ఘోరానికి పాల్పడింది. అయితే కొద్దిపాటి ముప్పుతోనే అది ముగిసింది. ఈసారి తెలంగాణలో ఆ ట్రావెల్స్ బస్సు వల్ల ప్రమాదం సంభవించింది.
యాదాద్రి: దివాకర్ ట్రావెల్స్ బస్సు మరోసారి ప్రమాదానికి కారణమైంది. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఆ ట్రావెల్స్ బస్సు వల్ల ప్రమాదం సంభవించింది. అయితే, కొద్దిపాటి నష్టంతోనే అది బయటపడింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో దివాకర్ ట్రావెల్స్ బస్సు ఓ బైక్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్పల్లికి చెందిన కందుకూరి నర్సింహ ద్విచక్రవాహనంపై అతని ఇద్దరు పిల్లలతో కలిసి జాతీయ రహదారి మీదుగా వెళ్తూ చిన్నకొండూరు క్రాస్ రోడ్డు దాటే ప్రయత్నంలో ఉన్నాడు.
అదే సమయంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దివాకర్ ట్రావెల్ బస్సు ఆ ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టింది. దాన్ని గమనించకుండా డ్రైవర్ సాంబయ్య బస్సును అదే వేగంతో ముందుకు నడిపించాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు కిందపడిపోయిన ముగ్గురిని పెకి లేపి ఆస్పత్రికి తరలించారు.
కొంత మంది వేగంగా వెళ్తున్న బస్సును వెంబడించారు. అర కిలోమీటరు వెళ్లిన తర్వాత బస్సు దొరికింది. దివాకర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ను కిందికి దింపి అతనిపై దాడి చేశారు. అతన్ని తీసుకుని వెళ్లి పోలీసు స్టేషన్లో అప్పగించారు. ఈ ప్రమాదంలో నర్సింహ అరికాలు మణికట్టు విరిగింది. అతని కూతురు పల్లవి ఎడవ చేయికి గాయమైంది.