సెల్లు పోయిందంటూ సొల్లు.. చర్చి ఫాదర్కు శఠగోపం.. మొబైల్, బైక్తో జంప్..!
రంగారెడ్డి : నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు కొందరు. కష్టాల్లో ఉన్నామంటూ కన్నీళ్లు పెట్టుకుంటే.. గుండె తరుక్కుపోయి సాయం చేస్తున్నవారికే చిల్లు పెడుతున్నారు. చివరికి పరిస్థితి ఎలా తయారవుతోందంటే.. సాయం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో చర్చి ఫాదర్కు శఠగోపం పెట్టిన తీరు చర్చానీయాంశమైంది.
హడావిడిగా తన దగ్గరకు వచ్చిన ఇద్దరు యువకులకు సాయం చేయబోయి ఇరుక్కుపోయారు ఫాదర్. అదే సమయంలో మరో వ్యక్తికి కూడా కహానీ చెప్పి బైకుతో ఉడాయించారు. నిందితులు ఇంటర్మీడియట్ విద్యార్థులు కావడం గమనార్హం.
లేడీ కాదు కిలాడీ.. సాఫ్ట్వేర్ బ్రహ్మీని నిండా ముంచిదిగా..!
సెల్లు పోయిందంటూ ఫాదర్ ఫోనుకు ఎసరు
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని ఫాతిమాఫూర్ చర్చికి ప్రతి ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. 19వ తేదీన కూడా అలాగే చాలామంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్దసంఖ్యలో వెళుతుంటారు. ఆ క్రమంలో ఇద్దరు వ్యక్తులు చర్చి ఫాదర్ను బురిడీ కొట్టించారు. తమ సెల్ఫోన్ ఎవరో ఎత్తుకెళ్లారంటూ కట్టుకథలు చెప్పి.. ఫాదర్ మొబైల్ ఫోన్తో ఉడాయించారు.
ఫోన్ పాయే.. బండి పాయే.. నమ్మకానికి శిక్ష
ఆదివారం నాడు ప్రత్యేక ప్రార్థనల తర్వాత ఆ రాత్రికి ఆ ఇద్దరు యువకులు ఫాతిమాపూర్లోనే బస చేశారు. సోమవారం (20.05.2019) నాడు అక్కడి నుంచి బయలుదేరేందుకు రెడీ అయ్యారు. అయితే తమ సెల్ఫోన్ పోయిందంటూ నాటకమాడారు. అలా చర్చి ఫాదర్ సైమన్ రెడ్డి దగ్గరకెళ్లి గోడు వెళ్లబోసుకున్నారు. పోయిన తమ సెల్ఫోన్ను ట్రాక్ చేస్తామంటూ నమ్మించి ఆయన మొబైల్ ఫోన్ తీసుకున్నారు.
ఫాదర్ మొబైల్తో ట్రాక్ చేస్తున్నట్లు నటించారు. కిలోమీటర్ దూరంలో తమ సెల్లును దొంగిలించిన వ్యక్తి ఉన్నట్లుగా ట్రాక్ అవుతోందని పిట్టకథలు చెప్పారు. అక్కడకు వెళ్లి పట్టుకుంటామని.. ట్రాక్ చేయడానికి మీ ఫోన్ కావాలంటూ రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు అక్కడే ఉన్న సుధాకర్ రెడ్డి అనే మరో వ్యక్తి బైక్ అడిగారు. దాంతో సరేనని చర్చి ఫాదర్ తన మొబైల్ ఇస్తే.. సుధాకర్ రెడ్డి తన బండి ఇచ్చారు. ఇక ఆ రెండు తీసుకుని అక్కడినుంచి జంప్ అయ్యారు.
ఇంటర్ విద్యార్థులే దొంగలు..!
కిలోమీటర్ దూరంలో తమ ఫోన్ దొంగిలించినోడు ఉన్నాడంటూ మాయమాటలు చెప్పిన సదరు వ్యక్తులు ఎంతకూ తిరిగి రాకపోవడంతో మోసం జరిగిందని గుర్తించారు ఫాదర్. నమ్మకంతో వంచించిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరా అని ఆరా తీశారు. చర్చిలోని సీసీ ఫుటేజ్ పరిశీలించడంతో నిందితుల గుట్టురట్టైంది. వారిద్దరు కూడా సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఈ సంవత్సరమే ఇంటర్ పూర్తి చేసినట్లు గుర్తించారు. ఆ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.