ఒకే విద్యార్థికి రెండు మెమోలు .. ఒకటి పాస్ మరొకటి ఫెయిల్ .. డైలమాలో విద్యార్ధి భవిష్యత్
ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల జీవితాలతో ఆట లాడుతోంది. ఇటీవల విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలు విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పరీక్షలన్నీ బాగా రాసిన ఫలితాలలో ఫెయిల్ అయినట్టు గా వచ్చిందని బోరున విలపించిన ఓ విద్యార్థిని తాను పాస్ అయినట్లుగా మెమో రావడంతో గందరగోళంలో పడింది.
ఒక మెమోలో పాస్ అయినట్టు, ఒక మెమోలో ఫెయిల్ అయినట్టు ఒకే విద్యార్థినికి రావడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది ఆ విద్యార్థిని.
వివరాల్లోకి వెళితే ముస్తాబాద్ కు చెందిన శ్రీనిధి అనే విద్యార్థిని సిద్దిపేటలోని గురుకృప కళాశాలలో ఎంపీసీ ఫస్టియర్ చదివి పరీక్షలు రాసింది. శ్రీనిధి ఫస్ట్ ఇయర్ లో ద్వితీయభాషగా సంస్కృతాన్ని ఎంపిక చేసుకుంది. అయితే శ్రీనిధి కి వచ్చిన మెమోలలో ఒకటి సంస్కృతం కాగా, మరొక మెమోలో తెలుగు అని వచ్చింది. ఒక మెమో పాస్ అయినట్లుగా ఉండగా, మరో మెమోలో ఫెయిలయినట్లు గా ఉంది. మెమోలను తీసుకుని కళాశాలకు వెళ్లిన విద్యార్థికి కళాశాల యాజమాన్యం తామేమీ చేయలేమని బోర్డు అధికారుల దృష్టికి తీసుకువెళతామని చెప్పి చేతులెత్తేశారు. దీంతో ఆ విద్యార్థిని పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
ఒకటి కాదు రెండు కాదు వేల తప్పిదాలను ఇంటర్మీడియట్ బోర్డు చేసింది. చాలా మంది విద్యార్తుల భవిష్యత్ అంధకారం చేసింది. ఇక ఎలాంటి తప్పిదాలు జరగలేదని నిపుణుల కమిటీ కితాబిస్తోంది. విద్యార్థులు మాత్రం ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.