ధీరవనితకు ఓ బిగ్ సెల్యూట్: పోకిరీలతో కాళ్లు మొక్కించుకుంది(వీడియో)
హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
హైదరాబాద్: నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తనను లైంగిక వేధింపులకు గురిచేసిన ఇద్దరు యువకులకు ఓ విమాన మహిళా సిబ్బంది తగిన గుణపాఠం చెప్పింది. ఏకంగా తన కాళ్లను మొక్కించుకుంది.
అభ్యంతరకర వ్యాఖ్యలు
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. శనివారం రాత్రి ఇండిగో ఎయిర్ లైన్స్లో పనిచేస్తున్న సదరు మహిళ తన విధులు ముగించుకుని విమానాశ్రయం నుంచి ఇంటికి బయల్దేరింది. అదే సమయంలో, తిరుపతి వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన భరత్, అతని సోదరుడు కళ్యాణ్.. ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
లైంగిక వేధింపులు..
అంతేగాక, ఆమెను లైంగికంగా వేధించారు. వెంటనే ఆమె సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విమానాశ్రయ పోలీస్ ఔట్ పోస్టుకు తరలించారు.
క్షమాపణలు కాదు.. కాళ్లు మొక్కండి..
ఈ క్రమంలో ఆందోళనకు గురైన నిందితులిద్దరూ తమపై కేసు పెట్టవద్దంటూ బాధితురాలిని వేడుకోవడం ప్రారంభించారు. చేసిన తప్పుకు క్షమాపణలతోపాటు తన కాళ్లు మొక్కాలంటూ బాధితురాలు తేల్చి చెప్పారు. దీంతో ఆమె కాళ్లు కూడా మొక్కారు నిందితులు. కొంత శాంతించిన ఆమె వారిపై ఎలాంటి కేసు పెట్టకుండా వదిలేసింది.
ఈ మేరకు ఇండిగో ఎయిర్ లైన్స్ ఓ ప్రకటన చేసింది.
ఆమె వదిలేసినా..
కాగా, విమానాశ్రయ పోలీసులు మాత్రం విమానాశ్రయంలో న్యూసెన్స్ చేసినందుకు వారిపై కేసు పెట్టారు. పార్కింగ్ ప్రాంతంలో ఈ గొడవ జరిగిందని ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ మహేష్ తెలిపారు. బాధితురాలిని వేధిస్తున్న సమయంలో వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకున్నారని చెప్పారు. బాధితురాలు కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేయనందున వారిపై కేసు పెట్టలేదని, అయితే, విమానాశ్రయంలో న్యూసెన్స్ చేసినందుకు నిందితులపై కేసు పెట్టామని వివరించారు.