మైనర్ బాలికలైన అక్కా చెల్లెళ్ళపై ఐదుగురు కామాంధుల అత్యాచారం ... వారిలో ముగ్గురు మైనర్లు
బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా అవి బాలికలను కాపాదలేకపోతున్నాయి . కామాంధులకు ఉరిశిక్ష వేసినా,నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా,ఎన్ కౌంటర్ లు చేసినా సరే అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఒకపక్క అత్యాచారాల నివారణకు కఠిన చట్టాలు చేస్తూ, నిత్యం పహారా కాస్తూ ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తున్నా నిత్యం ఎక్కడో ఒక చోట కామాంధుల అకృత్యాలకు అమాయక బాలికల అందమైన జీవితం ఛిద్రం అవుతూనే ఉంది.
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం ..
మనుషుల్లో రోజురోజుకీ మానవతా విలువలు నశిస్తున్నాయి. పశు ప్రవృత్తి పెరుగుతుంది . పోక్సో చట్టాల్లో సవరణలు చేసినా, చిన్నారులపై లైంగిక దాడులు చేస్తే ఉరి శిక్ష వేసేలా చట్టాలు మార్చినా సరే అన్నెం పున్నెం ఎరుగని పసికందులను కామాంధులు చిదిమేస్తున్న సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయి. ఇక తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఇద్దరు అమాయక మైనర్ బాలికలైన ఇద్దరు అక్కాచెల్లెళ్ళపై అయిదుగురు కామాంధులు అత్యాచారం చేశారు.
మైనర్ బాలికలైన అక్కా చెల్లెళ్ళపై గ్యాంగ్ రేప్
అక్కా చెల్లెళ్ళలో ఒకరు తొమ్మిదవ తరగతి చదువుతున్నారు .మరొకరు ఏడో తరగతి చదువుతున్నారు. వీరిలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో ప్రలోభ పెట్టిన ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఆ విషయం అందరికీ చెబుతానని బెదిరించి తన నలుగురు స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చారు. ఇక అంతటితో ఆగక ఆ తర్వాత ఆమె చెల్లెలితో ఈ ఐదుగురిలో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు.
కమాటిపురా పోలీసులకు ఫిర్యాదు.. ఐదుగురు అరెస్ట్
ఇక దీంతో బాధిత అమ్మాయిలు బోరున విలపిస్తూ తమ ఇంట్లో చెప్పారు. ఇక తల్లిదండ్రులు తమ కుమార్తెలపై ఘాతుకానికి పాల్పడిన వారిపై కమాటిపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అయిదుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ అయిదుగురిలో ముగ్గురు మైనర్ బాలురు ఉన్నారు. ఈ అత్యాచార ఉదంతంపై పోలీసులు పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు.