జూబ్లీహిల్స్ కాల్పుల ఘటన: మరో ఇద్దరి అరెస్టు
హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని జూబ్లీహిల్స్ నీరూస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. నీరూస్ సమీపంలో దొంగతనం కోసం వచ్చిన కర్ణాటకు చెందిన దొంగల ముఠా పోలీసులపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో సంఘటన స్థలంలోనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు మరో ఇద్దరు నిందితులు సమీర్, నవీనుద్దీన్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని బిస్-సీలో నగదు కొల్లగొట్టేందుకే ఇద్దరు నిందితులు కర్ణాటక నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చారు. మాదాపూర్ బిగ్-సిలో మేనేజర్గా పనిచేసే మహ్మద్ సమీయుద్దీన్ అలియాస్ సమీ పథక రచన చేశాడు.
సూత్రధారిగా వెనుక నుంచి కథ నడిపించాడు. ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను వెంటాడి పట్టుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో నిందితుడు కాల్పులు జరపడంతో ఎల్ అండ్ టీ ఉద్యోగి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.
గత శుక్రవారం మీడియా సమావేశంలో గుల్బార్గా గ్యాంగ్ను ఏవిధంగా నగర పోలీసులు పట్టుకున్నారో హైదరాబాదు పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి వివరించారు. గుల్బర్గా గ్యాంగ్ను పట్టుకున్న వారికి సీపీ మహేందర్ రెడ్డి ప్రశంసించారు. వారికి నగదు బహుమతులు కూడా అందజేశారు.