ఎంసెట్ లీకేజీ: కోల్కతాకు తీసుకెళ్లి విద్యార్థులను ప్రిపేర్ చేశారు
హైదరాబదా్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ కేసులో కీలకమైన మరో ఇద్దరిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లా జోగిపేటకు చెందిన గుడిపల్లి చంద్రశేఖర్రెడ్డి, హైదరాబాద్ మోతీనగర్కు చెందిన షేక్ షకీరా అరెస్ట్ చేశారు. వీరిద్దరిని సీఐడీ అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.
కోల్కతాకు తీసుకుని వెళ్లి విద్యార్థులను వారిద్దరు ప్రిపేర్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో సిఐడి అధికారులు ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మరో నలుగురు కీలకమైన నిందితులను అరెస్టు చేయాల్సి ఉంది. వారి కోసం సిఐడి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా, ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీలో అసలు సూత్రధారి ఇక్బాల్ అలియాస్ ఖలీల్ అని సిఐడి తేల్చినట్లు సమాచారం. అతని తర్వాత లీకేజీ వ్యవహారంలో రాజగోపాల్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. పేపర్ లీకేజీలో ఘటనలో 13 మంది ప్రమేయం ఉన్నట్లు తేలింది.. ఎంసెట్-2 ప్రశ్నపత్రాలు గత మేలోనే ఇక్బాల్ చేతికి అందినట్లు అందాయని అంటున్నారు.
ఇక్బాల్ అలియాస్ ఖలీల్ను రాజగోపాల్కు రాజేశ్ అనే అతను పరిచయం చేశాడు. మేనేజ్మెంట్ కోటాలో మెడికల్ సీట్లు ఇప్పించే ఇక్బాల్తో 8802364319 నంబర్లో రాజగోపాల్ సంప్రదింపులు జరిపేవాడని అంటున్నారు. పెద్దమొత్తంలో సంపాదిస్తుండటంతో రాజగోపాల్ తనకు పరిచయస్తుడైన ఓ లాడ్జ్ రూం బాయ్ శంకర్ పేరుతో లాకర్ తెరిచాడు. మరింత ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ప్రశ్నపత్రాల్ని లీక్ చేసి విక్రయించాలని ఇక్బాల్, రాజేశ్తో తన ఆలోచనను పంచుకున్నాడు.
దాంతో ఎంసెట్-2 ప్రశ్నపత్రాలు తన వద్ద ఉన్నాయని, అవసరమైన వారికి విక్రయించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా రాజగోపాల్కు ఇక్బాల్ సూచించాడు. రూ. 25 లక్షలు చెల్లించే స్థితి ఉన్నవారినే ఎంపిక చేసి పేపర్ లీక్ చేయాల్సిందిగా చెప్పాడు. రంగంలోకి దిగిన రాజగోపాల్ తనకు పరిచయం ఉన్న మధ్యవర్తులు విష్ణువర్ధన, జ్యోతిబాబులను సంప్రదించాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్-2 లీకేజీ ఒప్పందానికి విద్యార్థులను తాను గుర్తించినట్లు రాజగోపాల్ చెప్పడంతో ఇక్బాల్ పథకం వేసి, అమలు పరిచాడదు. పరీక్షకు ఒక రోజు ముందు జూలై 8వ తేదీన తాను బెంగళూరుకు చేరుకుంటానని, అప్పటికి సదరు విద్యార్థులను అక్కడికి తీసుకురావాలని రాజగోపాల్కు సూచించాడు. చెప్పినట్లుగా జూలై 8న ఉదయానికల్లా ఇక్బాల్ ఎంసెట్-2 ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాలను తీసుకొని బెంగళూరు వెళ్లాడు.
బెంగళూరు బనసవాడి బస్టాండు సమీపంలో ఉన్న ఉపహార్ రెస్టారెంట్కు విద్యార్థులను విష్ణువర్ధన, తిరుమల్, జ్యోతిబాబు ఆటోల్లో ఇక్బాల్ చెప్పిన హోటల్ వద్దకు తరలించారు. ఒక్కో దాంట్లో 160 ప్రశ్నలు ఉన్న రెండు ప్రశ్నపత్రాలను విద్యార్థులకు ఇచ్చి వారితో ప్రిపేర్ చేయించారు.
కాగా ఈ కేసులో విద్యార్థులు వారి తల్లిదండ్రులను సీఐడీ సాక్షులుగా చేర్చింది. ఈ కేసులో ప్రాధాన నిందితుడు రాజగోపాల్తోపాటు మధ్యవర్తులు విష్ణువర్ధన, తిరుమల్ రావు, షేక్ రమేశ్, వెంకటరామయ్య, బండారు రవీంద్ర అరెస్టు అయ్యారు. ప్రధాన సూత్రధారి ఇక్బాల్ కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.