మరో నెలరోజుల్లో 2 కొత్త జిల్లాలు.. నారాయణపేట, ములుగు ఏర్పాటు స్పీడప్
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణలో ప్రస్తుతమున్న 31 జిల్లాలకు మరో 2 జిల్లాలు తోడయ్యాయి. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. మహబూబ్నగర్ జిల్లా నుంచి నారాయణపేటను.. అదేవిధంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా నుంచి ములుగును వేరుచేశారు.
ఈ రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం తరపు నుంచి ప్రాథమిక ప్రక్రియ పూర్తయింది. ఇక మహబూబ్నగర్ జిల్లా, భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్లను నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు రెవెన్యూ శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారి.
కేసీఆర్ హామీ.. మరో 2 జిల్లాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాలుగా విస్తరించారు. అయితే కొన్నిచోట్ల తమ ప్రాంతాలను కూడా జిల్లాలుగా ప్రకటించాలని పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. కానీ కొన్ని కారణాలతో ప్రభుత్వం 31 జిల్లాలకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాల కోసం తీవ్రస్థాయిలో జరిగిన ఆందోళనలను సీఎం కేసీఆర్ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించింది. దీంతో ఎలక్షన్ల ప్రచారంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తే నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ క్రమంలో రెండోసారి అధికారం చేపట్టాక.. ఇచ్చిన మాట ప్రకారం ఈ రెండు జిల్లాల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేశారు.
పనుల్లో వేగం పెరగాలి.. ప్రాజెక్టులు పూర్తవ్వాలి.. సీఎం దిశానిర్దేశం
33 జిల్లాల తెలంగాణ
మరో 2 జిల్లాలను ప్రకటించడంతో 33 జిల్లాల తెలంగాణగా రాష్ట్రం అవతరించింది. నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నలిచ్చిన ప్రభుత్వం ఆ మేరకు జీవో నెంబర్లు 533, 534 విడుదల చేసింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాలని మహబూబ్నగర్, భూపాలపల్లి జయశంకర్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు రెవెన్యూ శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారి. దీంతో ఈ రెండు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి నెల రోజుల పాటు ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు కలెక్టర్లు. ఈ లెక్కన మరో నెల రోజుల వ్యవధిలో కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి.
కొత్త జిల్లాల స్వరూపం ఇదే..!
మహబూబ్నగర్ జిల్లా నుంచి నారాయణపేటను ప్రత్యేక జిల్లాగా వీడదీయనున్నారు. దీంతో 12 మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటుకానుంది. కోస్గి, కృష్ణ, నర్వ, ఊట్కూరు, కోయిల్ కొండ, దామరగిద్ద, ధన్వాడ, మక్తల్, మరికల్, మద్దూరు, మాగనూరు, నారాయణపేట మండలాలు కొత్త జిల్లా పరిధిలోకి రానున్నాయి.
భూపాలపల్లి జయశంకర్ జిల్లా నుంచి ములుగు జిల్లాను వేరు చేస్తున్నారు. దీంతో 9 మండలాలతో కొత్త జిల్లా రూపుదిద్దుకోనుంది. తాడ్వాయి, వెంకటాపూర్, ఏటూరు నాగారం, మంగపేట, ములుగు, వాజేడు, కన్నాయిగూడెం, గోవిందరావుపేట, వెంకటాపురం మండలాలు కొత్త జిల్లా పరిధిలోకి వస్తాయి.