వరంగల్కూ పాకింది: నిట్లో డ్రగ్స్, అదే అడ్డా.. బయటపడ్డ సంచలన విషయాలు!
ఇక్కడి విద్యార్థులు డ్రగ్స్ వాడుతుండటం స్థానికులకు చాలామందికి తెలిసిన విషయమే.
వరంగల్: నిన్న మొన్నటిదాకా రాజధాని హైదరాబాద్ను ఓ కుదుపు కుదుపేసిన డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు వరంగల్ కు పాకింది. ముఖ్యంగా ఖాజీపేటలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది.
నిజానికి నిట్ కళాశాలలో గతంలోను డ్రగ్స్ ఆనవాళ్లు లభించాయి. ఇక్కడి చాలామంది విద్యార్థులు డ్రగ్స్ వాడుతుండటం స్థానికులకు చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈ డ్రగ్స్ ఎక్కడినుంచి ఎలా సరఫరా అవుతున్నాయనే దానిపై తాజాగా సంచలన విషయాలు బయటపడ్డాయి.
2012బ్యాచ్:
నిట్ కళాశాలకు చెందిన 2012 బ్యాచ్ విద్యార్థులు గుర్రం ద్వీజి, ఎడ్ల రమేష్ డ్రగ్స్ సరఫరాలో కీలక సూత్రధారులుగా పోలీసులు తేల్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ దాడుల్లో ఈ సంచలన విషయం వెలుగుచూసినట్లు సమాచారం. నిట్ కళాశాలలో డ్రగ్స్ ఆనవాళ్లు మరోసారి బయటపడటంతో.. ఇక్కడ చదువుకుంటున్న తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
దర్గా వద్ద పాన్ షాప్స్ అడ్డా:
ఫ్యాషన్ పేరుతో సిగరెట్ అలవాటు చేసుకునే విద్యార్థులు.. క్రమ క్రమంగా డ్రగ్స్ వైపు ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది. కాజీపేట దర్గా వద్ద 100ఫీట్ల రోడ్డులో ఉన్న పాన్ షాప్స్ వీరికి అడ్డాగా మారినట్లు చెబుతున్నారు. సాయంత్రం 6గం. దాటగానే ఇక్కడికొచ్చే విద్యార్థులంతా గుప్పుగుప్పుమంటూ గంజాయి కొడుతారని తెలుస్తోంది. అర్థరాత్రి వరకు ఈ తతంగం కొనసాగుతుందని సమాచారం. ఇటీవల పోలీసులు రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది విద్యార్థులు పట్టుబడటంతో ఈ విషయాలు వెలుగుచూశాయి.
శీలావతి గంజాయి:
దర్గా వద్ద పాన్ షాప్స్ లో సిగరెట్స్ విక్రయించి, శీలావతి అనే గంజాయి అందులో వేసి విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నట్లుగా చెబుతున్నారు. గంజాయి నుంచి కొంతమంది డ్రగ్స్ వైపు కూడా ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది. నిట్ లో లై యాసిడ్ డీ తైలమడ్ అనే డ్రగ్స్ తో పట్టుబడ్డ గుర్రం ద్వీజి, ఎడ్ల రమేశ్ నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. డార్క్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో గోవా నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నట్లు గుర్తించారు.
కోడ్ భాషలో విక్రయాలు:
గోవా నుంచి తెప్పిస్తున్న డ్రగ్స్ ను నిట్ లో కోడ్ భాషలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గమనించారు. ఇప్పటికే దీనిపై ప్రాథమిక నిర్దారణకు వచ్చిన టాస్క్ ఫోర్స్ అధికారులు ద్వీజి, రమేశ్ ల్యాప్ టాప్స్ లో డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వీరితో లింకులున్న మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
దాసా విద్యార్థులతో డ్రగ్స్ అలవాటు:
నిట్ కళాశాలలో సుమారు 6700మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, ఎంబీఏ విద్యార్థులు, పీహెచ్ డీ స్కాలర్స్ ఉన్నారు. వీరితో పాటు డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్ అబ్రాడ్(దాసా)పేరిట ప్రతీ ఏడాది విదేశాలకు చెందిన 120మంది విద్యార్థులకు నిట్ లో అవకాశం కల్పిస్తారు. వీరిలో చాలా శాతం మంది విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడి ఇతరులకు అలవాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాసా విద్యార్థుల గదుల్లో మద్యం బాటిల్స్ ఉన్నా.. కళాశాల యాజమాన్యం మాత్రం వీరిని చూసీ చూడనట్లుగా వదిలేస్తోందన్న ఆరోపణలున్నాయి.
గేట్ వద్దే భద్రత:
నిట్ కళాశాలలో కేవలం ప్రధాన గేట్ వద్ద మాత్రమే భద్రతా సిబ్బంది హడావుడి ఉంటుంది తప్ప లోపల హాస్టల్లో, విద్యార్థుల క్లాస్ రూమ్స్ లో ఎటువంటి పర్యవేక్షణ లేదని చెబుతున్నారు. కళాశాలలో నిఘా కొరవడటంతోనే డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.