'దేవుడి'కి దూరం: పవన్ కళ్యాణ్ను వదిలివెళ్తున్న సన్నిహితులు, నిన్న ఒకరు, రేపు మరొకరు!
Recommended Video
అమరావతి/హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయా పార్టీలు మళ్లీ సినీ తారల వైపు చూస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆ నటుడు ఈ పార్టీలో చేరుతారు, ఈ నటి ఆ పార్టీలో చేరుతుందనే వార్తలు వస్తుంటాయి. ఇందులో కొన్ని వాస్తవం అయితే మరికొన్ని కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోతాయి.
తాజాగా, తెలుగు నటుడు, ప్రముఖ కమెడియన్ అలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి, పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారట. 2014 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది.
రాజకీయం వేరు, అభిమానం వేరు
ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు వివిధ పార్టీల్లో చేరుతున్నారు. తమకు ఆసక్తి కలిగిన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను బాగా అభిమానించే.. ఇంకా చెప్పాలంటే దేవుడిగా కొలిచే వారు ఇతర పార్టీల్లోకి వెళ్తుండటం గమనార్హం. పవన్ అంటే బాగా అభిమానించే వారు జనసేనలో చేరుతారని ఎవరైనా భావించడం సహజం. కానీ వీరిద్దరు మాత్రం రాజకీయాలు వేరు, అభిమానం వేరు అని చెబుతున్నట్లుగా ఉంది.
పవన్ కళ్యాణ్ను అభిమానించే వారిలో వీరు ముందు
పవన్ కళ్యాణ్ను బాగా అభిమానించే వారు ఎవరు అని అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేర్లు నిర్మాత బండ్ల గణేష్, జరబ్దస్త్ నటుడు హైపర్ ఆదిలతో పాటు కమెడియన్ అలీ కూడా ఉన్నారు. మొదటి ఇద్దరికి పవన్ అంటే ఇష్టం. ఆయనను దేవుడిగా చెబుతారు. ఇక కమెడియన్ అలీకి పవన్ కళ్యాణ్తో మంచి స్నేహం ఉంది. దీంతో ఆయన జనసేన వైపు ఉంటారని భావించారు. కానీ ఆయన ఎవరూ ఊహించని విధంగా వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.
కాంగ్రెస్లో బండ్ల గణేష్
బండ్ల గణేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని భావించినప్పటికీ అది కుదరలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. పవన్ కళ్యాణ్ గురించి అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేసేవారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ పవన్ తనకు దేవుడు అని, ఆయన గురించి తాను మాట్లాడనని చెప్పేవారు.
అలీ వైసీపీలోకి వెళ్తారా?
ఇప్పుడు అలీ కూడా వైసీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2014 ఎన్నికలకు ముందు ఇలాగే ప్రచారం సాగింది. ఆయన టీడీపీలో చేరుతారని, రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించేందుకు మురళీ మోహన్ ప్రయత్నాలు చేశారని వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్కు అందరికంటే సన్నిహితుడిగా పేరున్న అలీ వైసీపీలో చేరుతారా లేదా అనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వాల్సి ఉంది. దీనిపై జనసేన అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.