నాంపల్లి రైల్వే స్టేషన్: సులభ్ కాంప్లెక్స్లో తుపాకుల కలకలం
హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ సులభ్ కాంప్లెక్స్లో తుపాకులు కలకలం రేపాయి. శుక్రవారం రాత్రి మరుగుదొడ్లను శుభ్రం చేసే సిబ్బంది వీటిని గుర్తించారు. లుంగీలో చుట్టి ఉంచిన రెండు తుపాకులను గుర్తించిన వెంటనే సులభ్ కాంప్లెక్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
సులభ్ కాంప్లెక్స్లో...
సులభ్ కాంప్లెక్స్లో స్నానాదికాలు పూర్తి చేసుకోవడానికి వచ్చిన వ్యక్తులు తుపాకులు కావాలని ఇక్కడే వదిలివెళ్లినట్లు భావిస్తున్నారు. ఎవరినైనా హత్య చేసేందుకు దుండగులు తుపాకులతో వచ్చారా? లేదా ఆయుధాలు అక్రమంగా తరలించే ప్రయత్నం చేసి.. రైల్వే అధికారుల తనిఖీల్లో పట్టుపడతామని వదిలేసి వెళ్లారా? అనే అనుమానాలునెలకొన్నాయి. లేదా ఎవరికైనా ఇచ్చేందుకు తెచ్చి వారు రాకపోవడంతో ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారా? అనేది కూడా తేలాల్సి ఉంది.
నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోనే..
కాగా, సులభ్ కాంప్లెక్స్ నుంచి స్వాధీనం చేసుకున్న రివాల్వర్లు కాదని.. తపంచాలని పోలీసులు నిర్ధారించారు. తపంచాలు వదిలిపెట్టిన వ్యక్తుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అందుబాటులో ఉన్న ఆధారాలతో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం పరిశీలిస్తున్నారు.
అసాంఘిక కార్యకలాపాల కోసమేనా.??
శనివారం మధ్య మండలం డీసీపీ విశ్వప్రసాద్, సైషాబాద్ డివిజన్ ఏసీపీ సీ వేణుగోపాల్ రెడ్డి, నాంపల్లి ఇన్స్పెక్టర్లు ఖలీల్ పాషా, అదనపు ఇన్స్పెక్టర్ కిషోర్, ఎస్సై రెడ్డిగారి శ్రీకాంత్ రెడ్డిలు సంఘటన స్థలాన్ని సందర్శించారు. నాంపల్లి రైల్వే స్టేషన్కు వచ్చిన ప్రయాణికులే సులభ్ కాంప్లెక్స్లో వదిలివెళ్లినట్లుగా భావిస్తున్నారు. దోపిడీదారులు, రౌడీషీటర్లు, నక్సలైట్లు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు నగరానికి వచ్చి.. ఇలా సులభ్ కాంప్లెక్స్లో ఆయుధాలను వదిలేశారా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. వీటిని ఎవరికైనా విక్రయించడానికి ఇక్కడికి తీసుకొచ్చారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.