సోనియాను కలిశారా లేదా: కోదండపై సంచలనం, కేసీఆర్ వల్లే రగడనా?
తెలంగాణ జేఏసీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని బహిష్కృత నేత పిట్టల రవీందర్ బుధవారం ఆరోపించారు. ఎన్నికలు లేకుండా అధ్యక్ష పదవిని కోదండరాం ఒక్కరే అనుభవిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ జేఏసీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని బహిష్కృత నేత పిట్టల రవీందర్ బుధవారం ఆరోపించారు. ఎన్నికలు లేకుండా అధ్యక్ష పదవిని కోదండరాం ఒక్కరే అనుభవిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఉద్యమస్ఫూర్తిని కోదండరాం మంటగలుపుతున్నారన్నారు. ఎన్ని సంఘాలు వెళ్లినా జేఏసీని కాపాడుకున్నామని, అయితే అటెండర్ నుంచి అధ్యక్ష పదవి అన్నింటినీ కోదండరామే అనుభవిస్తున్నారన్నారు.
జేఏసీ రాజకీయాల గురించి ఆలోచించవద్దని చెబుతున్న కోదండరాం.. రాజకీయ పార్టీలను ఎందుకు కలుస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ఏ రాజ్యాంగ స్ఫూర్తితో సంజాయిషీ కోరకుండానే తనను సస్పెండ్ చేశారో చెప్పాలన్నారు.
కోదండరాం ఏఐసీసీ అధ్యక్షులు సోనియా గాంధీని కలిశారా లేదా చెప్పాలన్నారు. ఆ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదన్నారు. కోదండ విదేశాల్లో ఎవరిని కలిశారో చెప్పాలన్నారు. ప్రస్తుత జేఏసీని చూస్తే జాలేస్తోందన్నారు.
జేఏసీ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తుంటే తాను సరిదిద్దానని చెప్పారు. చైర్మన్గా కోదండరాం కొనసాగడంలో తమ కృషి లేదా అని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోకుంటే ప్రజాస్వామ్యానికి ఇబ్బంది అన్నారు.
ఇధ్దరి సస్పెన్షన్
తెలంగాణ జేఏసీలో కొంతకాలంగా కొనసాగుతున్న సంక్షోభం మరింత ముదిరింది. కోదండరాం వైఖరిని దుయ్యబడుతూ ఆ సంస్థ కన్వీనర్ పిట్టల రవీందర్, కో ఛైర్మన్ ప్రహ్లాద్లు సోమవారం బహిరంగలేఖ రాశారు. దీంతో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. దీంతో మంగళవారం అత్యవసరంగా సమావేశమైన ఐకాస స్టీరింగ్ కమిటీ పిట్టల రవీందర్, ప్రహ్లాద్లను తెఐకాస నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది.
పాలకుల కుట్ర
నిరుద్యోగ నిరసన ప్రదర్శనతో జేఏసీ ప్రజల గొంతుకగా ఎదగడాన్ని జీర్ణించుకోలేని పాలకులు కుట్రలను తీవ్రతరం చేశారని తెరాస ప్రభుత్వాన్ని ఉద్దేశించి జేఏసీ ఆరోపించింది. కొంతమందిని ప్రలోభానికి గురిచేసి, గందరగోళాన్ని సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జేఏసీ మండిపడింది. ఆ కుతంత్రాలను తిప్పికొట్టాలని నిర్ణయించామని చెప్పింది.
ఆ లేఖ మాకు తెలియదని..
ఈ నెల ఒకటిన ప్రహ్లాద్, రవీందర్, తన్వీర్ సుల్తానాలు కోదండరాంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాసిన అంతర్గతలేఖ మీడియాకు చిక్కడంతో తొలిసారిగా జేఏసీలో విభేదాలు బయటపడ్డాయి. ఆ లేఖ అంతర్గతమైందనీ, ఎలా బయటికొచ్చిందో తమకు తెలియదని రవీందర్, ప్రహ్లాద్లు వెల్లడించారు.
హైదరాబాద్ హోటల్లో..
ఈ నేపథ్యంలో జేఏసీ కోఛైర్మన్ ప్రహ్లాద్ అధ్యక్షతన రవీందర్, తన్వీర్ సుల్తానా సహా సోమవారం వివిధ జిల్లాలకు చెందిన కొందరు జేఏసీ నేతలు హైదరాబాద్లోని ఒక హోటల్లో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కోదండకు బహిరంగ లేఖ
అనంతరం వారు కోదండరాంకు రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. జేఏసీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తపర్చడానికి అవకాశాల్లేవని, కోదండరాం అనుసరిస్తున్న స్వీయ అస్థిత్వ ధోరణితో ఇది స్పష్టమవుతోందన్నారు. ఉద్యమ, పౌర సంఘాలు ఏర్పాటుచేసిన సభలు, సమావేశాల్లో ఉపన్యాసాలిచ్చి వెళ్లడం తప్ప కోదండరాం పాత్ర తెలంగాణ ఉద్యమంలో మరింకేమీ లేదనీ, ఉద్యమంలో అనేకమంది నేతలు ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయినా వారికి ఆయన న్యాయం చేసే ప్రయత్నాలేమీ చేయడం లేదన్నారు.
సస్పెన్షన్
కోదండరాంపై తీవ్ర విమర్శల నేపథ్యంలో మంగళవారం జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశమై జరుగుతున్న పరిణామాలపై కీలక నిర్ణయాలను తీసుకొంది. ప్రభుత్వ కుట్రలకు చేయూతనిస్తున్నారని పేర్కొంటూ పిట్టల రవీందర్, నల్లపు ప్రహ్లాద్లను జేఏసీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై పిట్టల రవీందర్, ప్రహ్లాద్లు స్పందించారు.