అక్కాచెల్లెళ్ల హత్య: త్వరలో యామిని పెళ్లి, 26సార్లు పొడిచి ఫ్యామిలీతో పరారీ
హైదరాబాద్: యామినీ సరస్వతిని పెళ్లి ముంగిట అమిత్ సింగ్ రూపంలో మృత్యువు కబళించింది. ఇటీవలే ఆమెకు పెళ్లి కుదిరింది. 15 రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. శ్రావణమాసంలో పెళ్లి చేయడానికి నిర్ణయించి మండపం కూడా బుక్ చేశారు.
భర్త ఆరోగ్యం కసరిగా లేకపోవడంతో పిల్లల పోషణ నిమిత్తం అమ్మాయిల తల్లి హైమావతి చూసుకుంటున్నారు. పిల్లల ఉన్నత చదువుల కోసమే తల్లి ఏడాది కిందట హైదరాబాద్కు వచ్చారు.
హైదరాబాదులో ప్రేమోన్మాది అమిత్ చేతిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. తన ప్రేమను నిరాకరిస్తోందని యువతిని, అడ్డు వచ్చిందని ఆమె అక్కను కత్తితో పాశవికంగా పొడిచాడు. ఇద్దరినీ విచక్షణారహితంగా 26 సార్లు పొడవడంతో చికిత్స పొందుతూ మరణించారు.
దుశ్చర్య అనంతరం దుండగుడితోపాటు అతడి కుటుంబమూ పరారైంది. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్కు చెందిన సింగిరెడ్డి కృష్ణారెడ్డి, హైమావతి కొంతకాలంగా కొత్తపేట గాయత్రీపురంలో నివాసముంటున్నారు. కృష్ణారెడ్డి ఆర్టీసీలో కండక్టర్గా పనిచేసి అనారోగ్యం కారణంగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
హైమావతి మహబూబ్నగర్ జిల్లాలోని షాద్ నగర్ ఉపవిద్యాధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. వీరి కూతుళ్లు యామినీ సరస్వతి(25), శ్రీలేఖ(23). యామినీ గతేడాదే బీటెక్ పూర్తి చేసింది. శ్రీలేఖ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సాగర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది.
నిందితుడు అమిత్ సింగ్ (27) షాద్నగర్ నుంచి వచ్చాడు. గతంలో షాద్నగర్ విశ్వభారతి జూనియర్ కళాశాలలో శ్రీలేఖ ఇంటర్ చదువుతున్న సమయంలో క్లాస్మేట్గా ఉన్నాడు. కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆమె వెంటపడుతున్నాడు.
మంగళవారం ఉదయం 8.30గంటల సమయంలో వచ్చిన నిందితుడు.. తన వెంట నాలుగు కత్తులు, ఎలక్ట్రికల్ వైర్ తెచ్చుకున్నాడు. అతడు యువతులు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చాడు. ఆ సమయంలో యామినీ బల్లపై పడుకొని ఉండగా, శ్రీలేఖ టీవీ చూస్తోంది.
అతడు, బయటకు పరుగెత్తుతున్న యామినిని ఆపి పొడిచాడు. పద్దెనిమిదిసార్లు కర్కశంగా పొడిచి, తలను పట్టుకొని తలుపుకేసి బాదడంతో దంతాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఆమెను వదిలిపెట్టి శ్రీలేఖపై పడ్డాడు. ఆమెను లోపలి గదిలోకి తీసుకెళ్లి ఎనిమిదిసార్లు పొడిచాడు.
ఈలోపు బయటికి పరిగెత్తిన యామిని మొదటి అంతస్తుకు చేరుకునేందుకు ప్రయత్నిస్తూ మెట్లపై పడిపోయింది. ఆమె అరుపులతో మొదటి అంతస్తులో నివాసం ఉంటున్న నాగేందర్ కిందకు వెళ్లాడు. అప్పటికే శ్రీలేఖను పొడిచిన అమిత్.. నాగేందర్ను తోసుకుంటూ పారిపోయాడు.
కాగా, నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఏసీపీ వేణుగోపాల్ రావు తెలిపారు. ఘటనాస్థలి నుంచి పరారైన వెంటనే అమిత్ సింగ్ తన తండ్రి అమర్ సింగ్కు ఫోన్ చేసినట్లు పోలీసులు దర్యాప్తు క్రమంలో గుర్తించారు.
అనంతరం ఎల్బీ నగర్ రింగ్రోడ్డు వరకు వెళ్లి సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. మరోవైపు షాద్నగర్లో అమర్ సింగ్ సైతం ఇంటికి తాళం వేసి భార్యాకూతురితో కలిసి పరారయ్యాడు. ఉదయం 11గంటల సమయంలో కూతురు చదివే కళాశాలకు వెళ్లిన అమర్ సింగ్.. అమిత్ రోడ్డుప్రమాదానికి గురయ్యాడని చెప్పి కూతురిని తీసుకెళ్లాడు.
చైతన్యపురి పోలీసులు షాద్నగర్ ఈశ్వర్ కాలనీకి వెళ్లి అమర్ సింగ్ ఇంటికి తాళాలు వేశారు. అమిత్ సింగ్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడనే దానిపై స్పష్టత లేదని పోలీసులు తెలిపారు. షాద్నగర్లో ఇంటర్ పూర్తయిన అనంతరం జాగృతి కళాశాలలో డిగ్రీ చేశాడని చెబుతున్నా.. షాద్నగర్, హైదరాబాద్ నారాయణగూడ కళాశాలలో అతడి పేరు లేదని దర్యాప్తులో తేలింది.
కొద్దిరోజుల వరకు దిల్సుఖ్నగర్ హుడాకాలనీలో ఉంటూ వెబ్డిజైనింగ్ కోర్సు అభ్యసించినట్లు చెబుతున్నారు. 15రోజుల క్రితం అక్కడి నుంచీ వెళ్లిపోయాడు.
ఇదిలా ఉండగా, ప్రేమ పేరుతో తరచూ తన కూతురి వెంటపడుతున్నాడంటూ అమిత్పై హైమవతి గతంలో షాద్నగర్, చైతన్యపురి పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది
షాద్నగర్ టీచర్స్ కాలనీలోని అద్దె ఇంట్లో ఉంటున్న కోడిగుడ్ల వ్యాపారి అమర్ సింగ్ కుమారుడు అమిత్సింగ్. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. షాద్నగర్లోని మరియారాణి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన అమిత్ సింగ్ విశ్వభారతి కళాశాలలోనే ఇంటర్ చదివాడు. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాడు.
ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ కుటుంబం కొన్నేళ్ల కిందట షాద్నగర్కు వలస వచ్చింది. స్థానిక విశ్వభారతి కళాశాలలో శ్రీలేఖ, అమిత్ సింగ్ ఇంటర్ చదువుకు ఒకే సంవత్సరంలో చేరారు. ఒకరు ఎంపీసీ, మరొకరు ఎంఈసీ. అప్పుడే వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే అమిత్ ప్రేమ పేరుతో శ్రీలేఖను వేధించేవాడు.