రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రతీకారం: హెచ్సీయూ వీసీ అప్పారావు హత్యకు కుట్ర
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ అప్పారావు హత్యకు కుట్ర పన్నగా, తూర్పు గోదావరి జిల్లా పోలీసులు భగ్నం చేశారు. వీసీ ఆప్పారావు హత్యకు విద్యార్థులు వ్యూహరచన చేశారు.
గతంలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆత్మహత్యకు ప్రతీకారంగా హెచ్సీయూ విద్యార్థులు కొందరు వీసీ హత్యకు కుట్ర పన్నారు. చందన్ మిశ్రా, పృథ్వీరాజ్లు కుట్ర చేసినట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు.
రోహిత్: స్మృతిXమాయా, 'అఫ్జల్ ఉగ్రవాదా కాదా సోనియా చెప్పాలి'
నిందితులు ఇద్దరినీ మీడియా ముందు ప్రవేశ పెట్టారు. భద్రాచలం చర్ల వద్ద వారిని పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన ఇద్దరూ చంద్రన్న దళ సభ్యులుగా భావిస్తున్నారు. మావోయిస్ట్ నేత హరిభూషణ్ ఆదేశాలతో హత్యకు పథక రచన చేశారని తెలిపారు.
చందన్ మిశ్రా హెచ్సీయులో ఎంఏ చదువుతున్నాడు. అతను పశ్చిమ బెంగాల్కు చెందినవాడు. అతనికి కృష్ణా జిల్లాకు చెందిన పృథ్వీరాజ్తో స్నేహం ఏర్పడింది. వీరు ఇరువురు హత్యకు కుట్ర పన్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరు పట్టుబడ్డారు.
కాగా, హెచ్సీయూలో వేముల రోహిత్ ఆత్మహత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ వీసీగా ఉన్న అప్పారావుపై విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేశాయి. ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి.