ఎఫ్బీ పరిచయం: హైదరాబాద్ రప్పించి ఉగాండా యువతిపై గ్యాంగ్రేప్
హైదరాబాద్: సోషల్ మీడియా పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నా.. యువత మాత్రం పట్టించుకోకుండా సమస్యలు ఎదుర్కొంటోంది. తాజాగా, సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని ఉగండా దేశానికి చెందిన ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు సూడాన్ దేశానికి చెందిన విద్యార్థులు. ఆమెను హైదరాబాద్కు రప్పించి ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం.
ఈ ఘటనపై బాధితురాలు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు మహ్మద్ ఫాజిర్, అమర్ హసన్లను అదుపులోకి తీసుకున్నారు.
ఎఫ్బీ తరచూ చాటింగ్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉగండాకు చెందిన యువతి(21) పుణేలో ఉద్యోగం చేస్తూ సోదరుడితో కలిసి అక్కడే నివాసముంటోంది.. రెండేళ్ల క్రితం దక్షిణభారత పర్యటన సందర్భంగా హైదరాబాద్లో ఉంటున్న మహ్మద్ ఫాజిర్ అనే సూడాన్ యువకుడు ఆమెకు కలిశాడు. తర్వాత ఆమె వివరాలను ఫేస్బుక్లో చూసిన అతడు దాని ద్వారా పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ తరచు ఛాటింగ్ చేసుకునే వారు.
అతని ఫ్లాట్కే వెళ్లింది..
కాగా, ఫాజిర్ కోరికపై నెల క్రితం ఆమె హైదరాబాద్కు వచ్చింది. మూడురోజుల పాటు ఇద్దరూ కలిసి పర్యాటక ప్రాంతాలన్ని చూశాక వెళ్లిపోయింది. మరోసారి రావాలంటూ అతడు అభ్యర్థించడంతో ఏప్రిల్ 28న మళ్లీ హైదరాబాద్కు వచ్చింది. ఈసారి హోటల్లో కాకుండా సీతాఫల్మండిలోని తాను ఉంటున్న ఫ్లాట్కు వెళ్దామన్నాడు. అక్కడకు వచ్చాక అమర్ హసన్ అనే యువకుణ్ని తన స్నేహితుడిగా పరిచయం చేశాడు. ముగ్గురూ కలిసి నాలుగురోజులపాటు హైదరాబాద్ అంతా పర్యటించారు.
మద్యం తాగించి అత్యాచారం
గురువారం రాత్రి ముగ్గురూ ఫ్లాట్కు చేరుకున్నారు. వచ్చేటప్పుడు మద్యం తెచ్చుకున్నారు. వద్దంటున్నా బలవంతంగా ఆమెతో కూడా తాగించారు. మత్తులో ఉండగా.. మహ్మద్ ఫాజిర్ ఆమెపై లైంగికదాడికి దిగాడు. ప్రతిఘటించడంతో ఇద్దరూ కలిసి తీవ్రంగా కొట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, శుక్రవారం ఉదయం పోలీసులను ఆశ్రయించి జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసింది బాధితురాలు.
నిందితులపై నిర్భయ కేసు
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ హైదరాబాద్ శివారులోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారని తెలిపారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. సూడాన్ రాయబార కార్యాలయానికి సమాచారం అందించిన అనంతరం వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించామని తెలిపారు.