నిన్న తెరాస ఇద్దరు ఎమ్మెల్సీలు, నేడు ఇద్దరు ఎంపీలు రాజీనామా
హైదరాబాద్: 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన మల్లారెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డిలు శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేశారు. వారు వేర్వేరుగా లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలిసి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. మల్లారెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
చేవెళ్ల ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వర రెడ్డి 2014లో తెరాస నుంచి గెలిచారు. ఆ తర్వాత ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో తన పదవికి రాజీనామా చేశారు. 2014లో పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన బాల్క సుమన్ కూడా చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కూడా రాజీనామా చేయనున్నారు.
గురువారం ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా రాజీనామాను సమర్పించారు. తెరాస ఎమ్మెల్సీలుగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్ రెడ్డి శాసనసభకు ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నుంచి గెలిచారు. టీఆర్ఎస్కు చెందిన వీరు ఎమ్మెల్యేలుగా ఎన్నికకావడంతో ఎంపీ, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.