ఆ ఇద్దరి మహిళల సహజీవనం చెడింది.. చివరకు ఎంత దారుణం జరిగిందంటే...
యాదాద్రి భువనగిరి జిల్లా,సూర్యాపేట జిల్లాల్లో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ఒక మహిళ హత్యకు గురవగా.. మరో మహిళపూ హత్యాయత్నం జరిగింది. వీరిద్దరు సహజీవనంలో ఉన్నవారే కావడం గమనార్హం. ఓ ఘటనలో డబ్బుల వ్యవహారమే హత్యకు దారితీయగా.. మరో ఘటనలో ఇద్దరి మధ్య విభేదాలే హత్యాయత్నానికి కారణమని తెలుస్తోంది. రెండు ఘటనల్లో నిందితులు వారి ప్రియులే అయినప్పటికీ.. తమకేమీ సంబంధం లేనట్టుగా వ్యవహరించి చివరకు దొరికిపోయారు.
పెళ్లి తర్వాత కూడా ఆమెతో సహజీవనానికి ప్రయత్నం..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకు చెందిన ఓ మహిళ(34).. అదే గ్రామానికి చెందిన ఊదరి రమేష్తో కొంతకాలం సహజీవనం చేసింది. కొన్నాళ్ల తర్వాత రమేష్ వేరే యువతిని వివాహం చేసుకోవడంతో ఇద్దరు దూరమయ్యారు. అయితే పెళ్లయిన కొంతకాలానికి రమేష్ తిరిగి ఆమెతో సంబంధం కోసం ప్రయత్నించాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. అలాగే గతంలో తన నుంచి తీసుకున్న రూ.20వేలు ఇవ్వాలని అతన్ని కోరింది.
డబ్బుల విషయంలో గొడవ.. హత్య..
రమేష్ మాత్రం ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడు. ఈ విషయంలో ఈ నెల 9న ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదేరోజు రమేష్ పీకలదాకా తాగి మద్యం మత్తులో ఆమెను హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అయితే హత్య జరిగినరోజు రమేష్ ఆమెతో గొడవపడినట్టు తెలియడంతో పోలీసులు కూపీ లాగారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్నప్పుడు చూశానని మృతురాలి చిన్న కుమారుడు తెలిపాడు. విచారణలో రమేష్ను పోలీసులు తమదైన శైలిలో విచారించడంలో నిజం ఒప్పుకోక తప్పలేదు. ప్రస్తుతం అతను రిమాండులో ఉన్నాడు.
సూర్యాపేటలో మరో ఘటన
మరో ఘటనలో సూర్యాపేటకు చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మూడేళ్ల క్రితం భర్త చనిపోవడంతో.. వీరాచారి అనే యువకుడితో ఆమె కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. ఆమెకు కుమార్తె,కుమారుడు ఉన్నారు. కుమార్తె రంగారెడ్డి జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటోంది. ఈ నెల 8న స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉండటంతో తల్లిని రావాలని కోరింది. ఇదే విషయాన్ని ఆమె వీరాచారితో చెప్పి ఇద్దరం వెళ్దామంది.
రాత్రిపూట హత్యాయత్నం
ఈ నెల 7న ఇద్దరు కలిసి రాత్రిపూట కుమార్తె చదువుకుంటున్న వసతి గృహం వద్దకు బయలుదేరారు. అయితే మార్గమధ్యలో వలిగొండ మండలం కమ్మగూడెం స్టేజీ వద్ద వీరాచారి ఆమెను కత్తితో పొడిచి పరారయ్యాడు. ఆపై స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి.. భార్యతో కలిసి బైక్పై వెళ్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పాడు. ఆమె మెడలోని బంగారం కూడా ఎత్తుకెళ్లినట్టు తెలిపాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారని తెలిసి.. అక్కడికి వెళ్లి విచారించారు. దాంతో అసలు నిజం బయటపడింది. వీరాచారే నిందితుడు అని తేల్చిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండుకు తరలించినట్టు సమాచారం.