కారులో ఇద్దరు స్త్రీల కిడ్నాప్: ఒక మహిళపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్: బస్సు కోసం నిరీక్షిస్తున్న ఇద్దరు మహిళలను కారులో కిడ్నాప్ చేసిన ముగ్గురు యువకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం హైదరాబాదు సమీపంలోని హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
చంపాపేట్ యాదగిరి కాలనీలో నివాసం ఉండే మహిళ (33) పాత చీరల వ్యాపారం చేస్తుంటుంది. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి వెనుక ఉండే మరో మహిళ (30) ఇళ్లల్లో పని చేస్తుంది. పని మీద హయత్ నగర్ వెళ్లేందుకు ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయం వద్ద బస్సు కోసం వేచి చూస్తున్నారు.
ఆ సమయంలో ఓ కారు వచ్చింది. హయత్నగర్కు వెళ్తున్నామని ఆ కారులోని వ్యక్తి చెప్పడంతో మహిళలు ఇద్దరూ కారెక్కారు. అప్పటికే కారులో ముగ్గురు యువకులు ఉన్నారు. హయత్ నగర్ వచ్చినా కారు ఆపలేదు. పెద్ద అంబర్పేట్ వైపు వెళుతుండడంతో మహిళలు అభ్యంతరం చెప్పారు.
అప్పటికే అసభ్యంగా....
స్త్రీలు కారు ఎక్కగాడనే ఆ యువకులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కారు ఔటర్ రింగు రోడ్డు వద్దకు వెళ్లగానే ఓ మహిళ (30) కారులోనుంచి దూకి పారిపోయింది. మరో మహిళ (33)ను ఔటర్ రింగు రోడ్డు సర్వీసు రోడ్డు గుండా గండి చెరువు దారిలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.
ఇలా గ్యాంగ్ రేప్...
నిర్మానుష్య ప్రదేశంలో ముగ్గురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె వద్ద నున్న సెల్ఫోన్, రూ.2,500 లాక్కున్నారు. పోలీసు వాహనం సైరన్ వినబడడంతో దుండగులు కారులో పరారయ్యారు. బాధితురాలు ఔటర్ రింగు రోడ్డు జంక్షన్ వద్దకు వచ్చి డీసీఎంలో ఇంటికి చేరుకుంది.
పోలీసులకు ఫిర్యాదు
బాధితురాలు సోమవారం సాయంత్రం హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేశారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు.
హయత్నగర్
హయత్నగర్ వచ్చినా కారు ఆపకపోవడంతో మహిళలు తీవ్రంగా కలబడ్డారు. రింగ్ రోడ్డు వద్దకు రాగానే కారు వేగం తగ్గడంతో ఓ మహిళ కారు దిగి పారిపోయింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.