ఫ్రెండ్ షిప్ డే నాడు ములుగు కొంగాల జలపాతంలో గల్లంతైన ఇద్దరు యువకులు మృతి, మృతదేహాల వెలికితీత
స్నేహితుల దినోత్సవం నాడు సరదాగా ములుగు జిల్లా వాజేడులోని కొంగాల జలపాతానికి వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. నిన్న వాజేడు మండలం కొంగాల జలపాతానికి వేర్వేరు ప్రాంతాల నుండి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు జలపాతంలో పడి ప్రాణాలను కోల్పోయారు. ఒక అర గంట వ్యవధిలోనే ఇద్దరు జలపాతంలో పడి గల్లంతయ్యారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన 24 సంస్వత్సరాల నరేష్, సంగారెడ్డి జిల్లాకు చెందిన 30 సంవత్సరాల రవితేజాచారి ఇద్దరు ప్రమాదవశాత్తు నీటిలో పడి పోయారు. రవితేజా చారి సంగారెడ్డి కొండాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలతో జలపాతం నిండుగా ఉండటంతో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. జలపాతంలో ఇద్దరు గల్లంతైన విషయం తెలుసుకున్న పోలీసులు రెస్క్యూ టీం తో గాలింపు చేపట్టారు. ఈ రోజు ఇద్దరి మృతదేహాలను జలపాతం నుండి బయటకు తీశారు. నరేష్, రవికుమార్ మృతితో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
సరదాగా జలపాతాన్ని చూడటానికి వెళ్ళిన యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వర్షాకాలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా జలపాతాలు జల కళతో ఉట్టిపడుతున్నాయి. ఈ సుందర దృశ్యాలను చూడడానికి విపరీతంగా పర్యాటకులు జలపాతాల వద్దకు వెళుతున్నారు. జలపాతాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, వర్షాల కారణంగా నీరు విపరీతంగా వస్తున్నందున సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే వాటిని చూడాలని పోలీసులు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రాణాలకు ప్రమాదం లేకుండా ప్రకృతి సోయగాలను ఆస్వాదించాలని చెప్తున్నారు.
ఫ్రెండ్ షిప్ డే నాడు ములుగు కొంగాల జలపాతంలో గల్లంతైన ఇద్దరు యువకులు మృతి, మృతదేహాల వెలికితీత #WaterFall #Wajedu, #Mulugu pic.twitter.com/yyMQc9ZR13
— oneindiatelugu (@oneindiatelugu) August 2, 2021