కూలీలకు మద్యం పోస్తూ టిక్ టాక్ వీడియోలు ... ఇద్దరు హైదరాబాద్ యువకులు జైలు పాలు
ఊరంతా ఒక దారైతే ఉలిపి కట్టెదిక దారి అన్న చందంగా అందరూ లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న వారి కోసం భోజనం , నిత్యావసరాలు ,కూరగాయలు , పండ్లు , మజ్జిగ తదితరాలు అందిస్తుంటే హైదరాబాద్ యువత కొంత మంది కాస్త వెరైటీగా ఉంటుంది అనుకున్నారేమో గానీ మద్యం అందించారు. రోడ్ల మీద ఉన్న దినసరి కూలీలను పిలిచి మరీ లిక్కర్ పోశారు. మద్యం షాపులు బంద్ ఉండటంతో రోజూ మద్యం సేవించటం అలవాటు ఉన్న కూలీలు మద్యం కోసం అల్లాడిపోతున్నారు అని ఫీల్ అయిన వాళ్ళు వారికి మద్యం పోయటమే కాదు ఏకంగా టిక్ టాక్ వీడియోలు చేశారు. ఇప్పుడు వారు చేసిన పనే ఇద్దరు యువకులను చిక్కుల్లోకి నెట్టింది.
లాక్ డౌన్ సమయంలో ఇద్దరు హైదరాబాద్ యువకుల నిర్వాకం
నిన్నటికి నిన్న చంపాపేట్ లో కొందరు యువకులు కూలీలకు లిక్కర్ పోస్తే ఇక తాజాగా హైదరాబాద్ నగరంలో ఇద్దరు యువకులు టిక్టాక్ వీడియోల్లో వెరైటీ చూపించాలనుకుని లిక్కర్ పోస్తూ వీడియోలు తీసి జైలుపాలయ్యారు. హైదరాబాద్లోని ఈద్ బజార్కు చెందిన ఇద్దరు యువకులు సంజూ, నితిన్ లు లాక్ డౌన్ నేపధ్యంలో వెరైటీగా ఏమైనా చేద్దాం అనుకున్నారు . అనుకున్నదే తడవుగా జనాలకు లిక్కర్ పోస్తూ టిక్టాక్ వీడియోలు చేసిన కారణంగా జైలు పాలయ్యారు . ఒక పక్క లిక్కర్ షాపులు బంద్ కొనసాగుతున్న తరుణంలో వీరు చేసిన పని వీరికి గ్రేట్ గా అనిపించింది కానీ ఆ పనే వారి కొంప ముంచింది .
మందుబాబులకు మద్యంపోస్తూ టిక్ టాక్ వీడియోలు .. సోషల్ మీడియాలో వైరల్
నగరంలో లాక్డౌన్ అమలులో ఉండగా మద్యం షాపులను బంద్ చేశారు. ఎవ్వరికీ ఎక్కడా చుక్క మద్యం కూడా దొరకని పరిస్థితి ఉంది . ఇటువంటి పరిస్థితుల్లో మందుబాబులకు మద్యం పోస్తూ టిక్టాక్ వీడియోలు చేసిన వీరిపై అక్రమ మద్యం సరఫరా కింద కేసు బుక్ చేసి లోపలేశారు పోలీసులు . టిక్ టాక్ పుణ్యమాని చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి కాస్తా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ దృష్టికి వెళ్ళటంతో లాక్డౌన్ ఆంక్షలు ఉల్లంఘించి మద్యాన్ని అక్రమంగా సరఫరా చేశారంటూ వారిపై కేసులు పెట్టించారు.
Recommended Video
కేసు పెట్టిన పోలీసులు .. యువకులు జైలు పాలు
ఎవరికీ మద్యం దొరకని సమయంలో మీ దగ్గర మద్యం ఎక్కడిది అంటూ పోలీసులు సదరు యువకులకు చుక్కలు చూపించారు .మంత్రి ఆదేశాలతో యువకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న సరూర్నగర్ ఎక్సైజ్ అధికారులు ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇప్పటికే పలు పక్క రాష్ట్రాల్లో ఇదే తరహా పని చేసి వీడియోలు చేసి పెడితే అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి . దీంతో తాము కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని భావించిన వారు చేసిన పని శ్రీకృష్ణ జన్మ స్థానానికి పంపించింది . దీంతో ఆ యువకులు లబోదిబోమంటున్నారు. ఇక ఈ తరహా పనులు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది అని అంటున్నారు తెలంగాణా పోలీసులు .