దారుణం: తెలిసిన వాళ్లని చనువుగా ఉంటే పదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
నిర్మల్: ఇంటి బయట ఆడుకుంటున్న పదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి, ఊరి పొలిమేరలకు తీసుకు వెళ్లి అత్యాచారం చేశారు కిరాతకులు. ఆ తర్వాత చిన్నారి తలను బండరాయితో మోది చంపేశారు. ఈ దారుణం నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. సోన్కు చెందిన అయిదో తరగతి బాలిక శనివారం సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన ప్రవీణ్, గణేష్లు మాయమాటలు చెప్పి సమీపంలోని పాత కూచన్పల్లి గ్రామ పొలిమేరలోకి తీసుకు వెళ్లి, ఆమెపై దారుణానికి ఒడిగట్టారు.
కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అంతా వెతికి, ఆ తర్వాత పోలీసులకు పిర్యాదు చేశారు. చిన్నారి కోసం పోలీసులు రాత్రి నుంచి గాలింపు చేపట్టారు. బాలిక గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. చిన్నారి ఫోటో, వివరాలు వాట్సాప్, పేస్బుక్, టెలిగ్రాంలలో పోస్ట్ చేశారు.
సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సోన్ గ్రామానికి చెందిన శ్రీనివాస్.. శనివారం సాయంత్రం ప్రవీణ్, గణేష్లు బాలికను సైకిల్ పైన తీసుకు వెళ్లగా చూసిన విషయాన్ని తెలిపాడు. పోలీసులు వారిని విచారించారు. విచారణలో అసలు విషయం తెలిసింది.
కూచన్పల్లి పొలిమేరలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పాప తలను బండరాయికి మోది హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. చిన్నారి మృతితో గ్రామస్తులు కంటతడి పెట్టారు. నిందితులు తెలిసిన వారు కావడంతో బాలిక చనువుగా ఉండేది. కానీ వారు అభంశుభం తెలియని పాపపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేశారు.