డేటా చోరీ నిజమే: ఆధార్ కార్యాలయం ధృవీకరణ: ఐటీ గ్రిడ్స్ పై తాజా కేసులు!
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన డేటా లీకేజీ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన సేవా మిత్ర యాప్ ద్వారా డేటా చోరీకి గురైందనే ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు సాగిస్తున్న దర్యాప్తు కీలక మలుపు తీసుకుంటోంది. ఈ వ్యవహారంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు ఏడు కోట్ల 82 లక్షలమంది ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇన్ని కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం ఐటీ గ్రిడ్స్ సంస్థ చేతిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీ సేవా మిత్ర యాప్ ను హైదరాబాద్ కు చెందిన ఐటీ గ్రిడ్స్ సంస్థ రూపొందించిన విషయం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు ఐటీ మంత్రి నారా లోకేష్ ల ప్రోద్బలంలో ఐటీ గ్రిడ్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందంటూ ఇదివరకే కేసు నమోదైంది. మాదాపూర్లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ తప్పుడు మార్గంలో ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందని, వాటిని టీడీపీకి చెందిన సేవామిత్ర అప్లికేషన్ ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టడంతో పాటు పార్టీకి అనుకూలంగా లేనివారి ఓట్లను కూడా తొలిగించిందని ఆరోపిస్తూ కేపీహెచ్బీ ప్రాంతానికి చెందిన లోకేశ్వర్రెడ్డి కిందటి నెల 2న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
అయ్యో టీడీపీ గెలుస్తుందని సబ్బం హరి జోస్యం చెప్పేసారు ! ఖచ్ఛితంగా తిరగబడుతుందా ?
ఆధార్ వద్ద ఉన్న సమాచారం అంతా ఐటీ గ్రిడ్స్ ఆధీనంలో..
ఈ వ్యవహారంలో ఐటీ గ్రిడ్స్ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముమ్మర దర్యాప్తు చేపట్టారు. సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దీనపై విచారణ కొనసాగిస్తోంది. తమ దర్యాప్తులో భాగంగా.. ఐటీ గ్రిడ్స్ సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్న సమాచారాన్ని మాదాపూర్ పోలీసులు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధార్ కు చేరవేశారు. ఐటీ గ్రిడ్స్ వద్ద ఉన్న సమాచారాన్ని, ఆధార్ సంస్థ ఉన్న డేటా బేస్ తో పోల్చి చూడాలని కోరారు. ఆధార్ కార్యాలయం అధికారులు పోలీసులు ఇచ్చిన సమాచారాన్ని పోల్చి చూసి, బిత్తరపోయారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ వద్ద నుంచి పోలీసులు సేకరించిన సమాచారం మొత్తం ఆధార్ కార్యాలయం డేటా బేస్ తో సరిపోవడంతో ఖంగు తిన్నారు.
ఫోరెన్సిక్ లాబొరేటరీ కూడా నిర్ధారించింది..
దీనిపై ఆధార్ డిప్యూటీ డైరెక్టర్ టీ భవానీ.. తాజాగా- మరో ఫిర్యాదు ఇచ్చారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి 7.82 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని అక్రమమార్గంలో సేకరించిందని అనుమానించారు. ఈ సమాచారం ఆధార్ సంస్థ వద్ద ఉన్న సమాచారం ఒకటేనని దర్యాప్తులో తేలింది. ఐటీ గ్రిడ్స్ సంస్థ.. అడ్డదారిలో ఆధార్ సంస్థలోని సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోసిటరీ లేదా స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ లింక్లోకి ప్రవేశించి, సమాచార చౌర్యానికి పాల్పడిందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు తేల్చారు. మరింత లోతుగా విశ్లేషించడానికి రెండు సంస్థల నుంచి సేకరించిన సమాచారాన్ని పోలీసులు తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. ఇందులో ప్రాథమికంగా ఆధార్కు సంబంధించిన అంశాలు ఉన్నాయని, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన 7,82,21,397 మంది వ్యక్తిగత సమాచారం హార్డ్డిస్క్లలో ఉన్నట్టు ఫోరెన్సిక్ లాబొరేటరీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఐటీ గ్రిడ్స్ పై తాజా కేసులు..
ఈ సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్సంస్థ.. టీడీపీ నిర్వహిస్తున్న సేవామిత్ర అప్లికేషన్కు అనుసంధానం చేసిందని తెలిసింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద ఉండాల్సిన సమాచారం ఈ సంస్థకు చేరినట్టు స్పష్టమైంది. సిట్ అధికారులు చేపట్టిన దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలపై ఆధార్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ శుక్రవారం ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు సెక్షన్ 37, 38-ఏ, 38-బీ, 38-జీ, 40, 42, 44-ఏఏల కింద ఐటీగ్రిడ్స్ సంస్థపై తాజాగా కేసులు నమోదుచేశారు. ఈ కేసును కూడా సిట్ దర్యాప్తు చేస్తుందని మాదాపూర్ పోలీసులు తెలిపారు.