లేఖల్లో ఏముంది?: హరీశ్కు ఉమాభారతి, బాబుకు తెలంగాణ ఎంపీ
ఢిల్లీ/నల్గొండ: రాష్ట్ర భారీ నీరుపారుదలశాఖ మంత్రి హరీశ్రావుకు కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి లేఖ రాశారు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకం కింద 99 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి, నాబార్డుకు మధ్య సెప్టెంబరు 6న ఢిల్లీలో ఒప్పందం జరగనుంది.
ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరుల సమన్వయ కమిటీ సభ్యుడు, రాష్ట్రమంత్రి హరీశ్రావును ఈ కార్యక్రమానికి రావలసిందిగా కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి లేఖ రాశారు.
ప్రాధాన్యతా క్రమంలో దేశ వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా నిధులు సమకూర్చనుంది. అందుకోసం నాబార్డుతో సెప్టెంబర్ 6న ఎంఓయూ కుదుర్చుకోనుంది. ఇందులో తెలంగాణకు చెందిన దేవాదాలు సహా 11 ప్రాజెక్టులు ఉన్నాయి.
చంద్రబాబుకు నల్గొండ ఎంపీ లేఖ
నల్గొండ: పులిచింతల నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ. 115 కోట్ల నష్టపరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేఖ రాశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పులిచింతల నిల్వ సామర్థ్యాన్ని పెంచడం వల్ల 3 ఎత్తిపోతల పథకాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. ముంపునకు గురవుతున్న చిట్యాల, నడిగడ్డ గ్రామాలపైన సర్వే జరిపి పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
పులిచింతలలో నీరు నిలువ చేయడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. పునరావాస కేంద్రాలను అన్ని సదుపాయాలతో రూపొందించాకే పులిచింతలలో నీటిని నిలువ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.