'అదీ ఉమామాధవ రెడ్డి సంస్కారం, రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో'
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టడం బాధాకరమేనని టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి ఉమామాధవ రెడ్డి అన్నారు. కానీ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నట్లు ఆమె ప్రకటించారు. మాధవ రెడ్డికి కేసీఆర్ మంచి స్నేహితులు అని చెప్పారు.
చంద్రబాబును నాతో పాటు ఉమామాధవరెడ్డి వ్యతిరేకించారు: కేసీఆర్ బాంబు! సందీప్కు హామీ
మాధవ రెడ్డిపై ఉన్న అభిమానంతో కేసీఆర్ తనను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని ఆమె చెప్పారు. కాగా, గురువారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో ఉమ, ఆమె తనయుడు సందీప్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సమయంలో ఉమ మాట్లాడారు.
ఎలాంటి డిమాండ్లు పెట్టలేదు
ఉమా మాధవ రెడ్డితో పాటు పలువురు నేతలు టీడీపీలో చేరారు. తాము రాష్ట్ర అభివృద్ధి కోసం, నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆమె తెలిపారు. అధికార పార్టీలో చేరేందుకు తాము ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని ఉమ వర్గీయులు వెల్లడించారు.
ఉమకూ కేసీఆర్ ప్రత్యేక ప్రశంసలు
ఉమా మాధవ రెడ్డి అధికార పార్టీలో చేరేందుకు ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని ముఖ్యమంత్రి వెల్లడించారు. అది ఆమె సంస్కారానికి నిదర్శనమని కేసీఆర్ ప్రశంసించారు. ఉమది గొప్ప మనసు అని కొనియాడారు. రాజకీయాల్లో గెలుపోటమిలు సర్వసాధారణమని, ఆరు నూరైనా కొత్త రాష్ట్రం బాగుపడాలని ఆకాంక్షించారు.
ఎవరికి ఏ అవకాశం వస్తుందో
ఉమ్మడి రాష్ట్రంలో ఏ అంశాల్లో ఇబ్బందిపడ్డామో, ఆ సమస్యలన్నీ పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. ఉమకు, సందీప్ రెడ్డికి టీఆర్ఎస్లో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. సందీప్ రెడ్డికి మంచి అవగాహన శక్తి ఉందని చెప్పారు. రాజకీయాల్లో ఎప్పుడు, ఎవరికి ఏ అవకాశం వస్తుందో తెలియదన్నారు.
రాజకీయాల్లో ఓపిక తక్కువ
ఈ రోజుల్లో రాజకీయాల్లో ఓపిక తక్కువగా ఉంటోందని ముఖ్యమంత్రి చెప్పారు. పార్టీలో ఇద్దరికీ ఉన్నత అవకాశం కల్పిస్తామని, నల్గొండ బాగా వెనుకబడిన జిల్లా అని చెప్పారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు, పలువురు నేతలు, కార్యకర్తలకు ఆయన స్వాగతం పలికారు.