ప్రజ్ఞ : చాలా సెన్సిటివ్, ఆమెది హత్యే: కుటుంబసభ్యులు
Recommended Video
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మహలక్ష్మినగర్లో అనుమానాస్పదస్థితిలో ప్రజ్ఞ అనే యువతి మరణించింది.ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని మృతురాలి కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ప్రజ్ఞకు ఎలాంటి ప్రేమ వ్యవహరం ఉన్నట్టుగా కూడ తమ దృష్టికి రాలేదని కుటుంబసభ్యులు చెప్పారు. ప్లాన్ ప్రకారంగా ఆమెను చంపేశారని కుటుంబసభ్యులు అభిప్రాయపడుతున్నారు.
మంచంపై పూలు, పండ్లు.. పక్కనే ఉరేసుకుని ఆమె: అసలేం జరిగింది?
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మహలక్ష్మీనగర్లో ఆర్టీసీ ఉద్యోగి గంగాధర్ గౌడ్ కుమార్తె ప్రజ్ఞ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ప్రజ్ఞ వివాహం ఈ ఏడాది మే మాసంలో 6వ తేదిన జరగాల్సి ఉంది. ఈ వివాహనికి సంబంధించిన లగ్నపత్రికను తిరుపతిలో వెంకటేశ్వరస్వామి వద్ద ఉంచి పూజలు నిర్వహించేందుకు తల్లిదండ్రులు వెళ్ళారు. కానీ, ప్రజ్ఞ అనుమానాస్పదస్థితిలో మరణించింది.
ప్రజ్ఞ అనుమానాస్పదస్థితిలో మరణానికి గురి కావడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తిరుపతి నుండి ఆ కుటుంబ సభ్యులు హుటాహుటిన నిజామాబాద్కు తిరిగి వచ్చారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్తో మాట్లాడిన కుటుంబసభ్యులు ఈ ఘటనపై అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రజ్ఞపై అత్యాచారం చేసి చంపేసి ఉంటారని అనుమానించారు.
అత్యాచారం చేసి చంపారు
ప్రజ్ఞను అత్యాచారం చేసి చంపేసి ఉంటారని కుటుంబసభ్యులు కొందరు అనుమానాన్ని వ్యక్తం చేశారు. ప్రజ్ఞ గదిలో పూలు, కేక్ , మెడలో తాళి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. చంపేసి ఆత్మహత్య చేసుకొందని చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు. హ్యపీ వెడ్డింగ్ డే అంటూ కేక్ ఉండడంపై కూడ వారు అనుమానిస్తున్నారు.
ప్రజ్ఞ చాలా సున్నిత స్వభావం గలది
ప్రజ్ఞ చాలా సెన్సిటివ్ మనస్థత్వం గలదని కుటుంబసభ్యులు చెప్పారు. చిన్న విషయానికే మనస్సు కష్టపెట్టుకొనేతత్వం ఆమెదన్నారు. ఎవరితోనైనా ప్రేమ వ్యవహరం ఉన్నట్టుగా మా దృష్టికి రాలేదన్నారు. అలాంటి విషయం ఉంటే తమకు చెప్పేదన్నారు. ప్రజ్ఞ మనస్తత్వం అలాంటిది కాదన్నారు. ఒకవేళ ఎవరినైనా ప్రజ్ఞ ప్రేమిస్తే తాము వివాహం చేసేవారమని మృతురాలి కుటుంబసభ్యులు చెప్పారు.
ఎంతమంది ఉన్నారో తేలాలి
ప్రజ్ఞ అనుమానాస్పద మృతిలో ఎవరెవరున్నారనే విషయాన్ని బయటపెట్టాలని మృతురాలి కుటుంసభ్యులు పోలీసులను కోరుతున్నారు. ఒకరున్నారా, అంతకంటే ఎక్కువమంది ఉన్నారా అనేది తేలాల్సి ఉందన్నారు. ప్రజ్ఞను పథకం ప్రకారం చంపేసి వెళ్ళిపోయారనివారు ఆరోపిస్తున్నారు.
వారం రోజుల్లో నిశ్చితార్థం
ప్రజ్ఞకు వారం రోజుల్లో నిశ్చితార్ధం జరగాల్సి ఉంది. ఏప్రిల్ 20వ తేదిన నిశ్చితార్ధం పెట్టుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. వచ్చే నెల 6వ తేదిన వివాహం చేయాల్సి ఉంది. ఈ వివాహ పత్రికను తీసుకొనే ప్రజ్ఞ తల్లిదండ్రులు తిరుపతికి వెళ్ళారు. ఆ సమయంలోనే ఆమె అనుమానాస్పద స్థితిలోనే మరణించింది.