స్నేహితులతో ఛాలెంజ్: ఆన్లైన్ క్లాసులు అర్థంకాక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా స్కూల్స్, కాలేజీలు తెరుచుకోవడం లేదు. ఈ క్రమంలో విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు ప్రత్యక్షంగా క్లాసులు విన్న విద్యార్థులకు ఇప్పుడు ఆన్లైన్ పాఠాలు అంతగా అర్థం కావడం లేదు. ఇదే కారణంతో తాజాగా ఒక విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. ఈ విషాద ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
న్యాయవాది కావాలనే లక్ష్యంతో..
వివరాల్లోకి వెళితే.. న్యూబోయిన్పల్లి కంసారి బజార్కు చెందిన దేవ యశ్వంత్(18) మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతని తండ్రి ప్లంబర్ కాగా, తల్లి ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. న్యాయవాది కావాలన్న లక్ష్యంతో యశ్వంత్ ఇంటర్లో హెచ్ఈసీ గ్రూపులో చేరాడు.
ఆన్లైన్ క్లాసులు అర్థంకాక..
కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో ఓ ప్రైవేటు కేంద్రంలో ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నాడు. అయితే, ఈ ఆన్లైన్ తరగతులు అర్థం కావడం లేదంటూ కొద్ది రోజులుగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబసభ్యులు వచ్చేసరికే.. మృతి
బయటికి వెళ్లిన కుటుంబసభ్యులు తిరిగి వచ్చి చూసేసరికి ఉరివేసుకుని కనిపించాడు యశ్వంత్. తీవ్ర భయాందోళనలకు గురైన కుటుంబసభ్యులు.. వెంటనే స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే యశ్వంత్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో యశ్వంతో కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్నేహితులతో ఛాలెంజ్ చేసి.. చివరకు ప్రాణాలు వదిలాడు..
యశ్వంత్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతడు రాసిపెట్టిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ తరగతులు ఏమీ అర్థం కావడం లేదని భవిష్యత్తుపై బెంగతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో యశ్వంత్ పేర్కొన్నట్లు తెలిసింది. అంతేగాక, తాను న్యాయవాది అవుతానని స్నేహితులతో ఛాలెంజ్ కూడా చేశానని.. ఇప్పుడు ఆ లక్ష్యం చేరుకుంటానో లేదో అర్థం కాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ప్రభుత్వం ఆన్లైన్ తరగతుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరాడు.